సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన

సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన

హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు, దోషికి సరైన శిక్ష పడే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. చిన్నారికి జరిగిన దారుణం తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు. అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది అన్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని బుధవారం సాయంత్రం పరామర్శించిన  పవన్ .. ఆ బిడ్డ తల్లిదండ్రులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.  ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిడ్డ కనబడకుండా పోతే ఆ తల్లిదండ్రులకు ఏమయ్యిందో అర్థం కాని పరిస్థితి అన్నారు. వినాయక చవితి కావడంతో విగ్రహాల వెంట వెళ్లిందేమోనన్న అనుమానంతో సరూర్ నగర్ ట్యాంక్ బండ్ నుంచి అన్ని ప్రాంతాల్లో వెతికారని.. ఒక ఇంటి మీద అనుమానం ఉంది చూడమంటే పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేకపోయారని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు చనిపోయిన బిడ్డకు న్యాయం జరగాలని కోరుకోవాలన్నారు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలకు.. మంత్రి వర్గంలోని పెద్దలను పంపి బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని ఇదే తన విన్నపం అని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు ఓదార్పు అవసరం. ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయగలమో ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం కావడం సమాజానికి అంత మంచిది కాదన్న పవన్ కళ్యాణ్.. మీడియా కొన్ని సంఘటనలపై ఎక్కువగా ప్రచారం చేసి ఇలాంటి వాటిపై స్పందించకపోవడం సరికాదన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో కూడా బాధ్యతగా ఉండాలన్నారు. ఏదో ఒక సంఘటనను పట్టుకుని హైలెట్ చేసి వదిలేయకుండా అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఎక్కువ మందికి తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు.  ఇప్పటి వరకు నిందితుడు దొరకలేదని, తమకు న్యాయం జరగలేదని చిన్నారి తల్లిదండ్రులు బాధపడుతున్నారని..  బిడ్డ చనిపోయిన బాధలో ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద మనసుతో అర్ధం చేసుకోవాలని..ఇది  నా తరఫున ఓ విన్నపం అని తెలిపారు పవన్ కళ్యాణ్.