
- పంచాయతీ ఎన్నికలపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నం
- జూబ్లీహిల్స్ బైపోల్లోపోటీ చేస్తం.. గెలుపు మాదే
- బనకచర్లను అడ్డుకొని తీరుతాం: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఆ తీర్పుకు తగ్గట్టుగానే ఎన్నికలు జరుగుతాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. లోకల్బాడీ ఎన్నికల్లో పార్టీ తరఫున 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంపై త్వరలో హైకమాండ్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ రిజర్వేషన్లపై బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని, గెలుపు కూడా కాంగ్రెస్దేనని మహేశ్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చనిపోతే ఆ నియోజకవర్గంలో ఇతర పార్టీలు పోటీ పెట్టకూడదనే సంప్రదాయాన్ని కేసీఆర్ కాలరాశారని పేర్కొన్నారు. వైఎస్సార్ కొనసాగించిన ఈ సంప్రదాయాన్ని కేసీఆర్ అమలు చేయకపోవడంతో, జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. తెలంగాణలో ఎప్పుడు, ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు కాంగ్రెస్ దేనని చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, ఆ తర్వాత జరిగే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తిరుగుండదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీసీల అభివృద్ధి గురించి కవిత మాట్లాడటమా?
బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి అన్యాయం జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ అన్నారు. ‘‘బనకచర్ల పాపం కేసీఆర్ దే. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడమే మా లక్ష్యం. దీనిపై రాజీ పడేది లేదు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టుకొమ్మని ఆంధ్రాకు చెప్పి, సహకరించింది బీఆర్ఎస్ కాదా? కృష్ణా జలాల వాటాకు సంబంధించి ఆంధ్రాతో ఒప్పందం చేసుకున్నదే బీఆర్ఎస్. దానిపై సంతకం పెట్టిందే హరీశ్రావు” అని మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉంటే.. కాంగ్రెస్లో మాత్రం దేవతలు ఉన్నారు. బీసీల అభివృద్ధి గురించి కవిత మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. ఆమెకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మద్దతుగా మాట్లాడడం విచారకరం” అని ఆయన అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో శిక్ష తప్పదు
‘‘పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ వెలగబెట్టిందేమిటి అంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఫోన్ ట్యాపింగ్ చేయడమే” అని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్తో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని, చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, దేశ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ హేయమైన చర్య అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ వారు ఎంతటి వారైనా సరే శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ‘‘బీఆర్ఎస్ తనకున్న సోషల్ మీడియాతో అన్ని అభూతకల్పనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు, సంక్షేమ పథకాలు రాకుండా వివక్షతో కేంద్రం అడ్డుకుంటుందని ఆయన అన్నారు.