రేవంత్ ​కామెంట్స్​పై దుమారం..

రేవంత్ ​కామెంట్స్​పై దుమారం..
  • ఫ్రీ కరెంట్​’ ఎత్తేసే కుట్ర: కేటీఆర్​, ఇతర మంత్రులు...
  • నేడు ఊరూరా కాంగ్రెస్​ దిష్టిబొమ్మల దహనం
  • రేవంత్​ మాటలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ​ఫైర్​
  • కరెంట్​ కోతలకు నిరసనగా నేడు సబ్​స్టేషన్ల ముందు ధర్నాలు

హైదరాబాద్, వెలుగు: అమెరికాలో పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పొలిటికల్ ​హీట్ ​పుట్టించాయి. అవసరమైతే సీతక్కే సీఎం అవుతారంటూ ఆయన చేసిన కామెంట్లు సొంత పార్టీ కాంగ్రెస్​లో దుమారం రేపుతుండగా.. ఉచిత విద్యుత్​పై చేసిన వ్యాఖ్యలను బీఆర్​ఎస్​ తీవ్రంగా ఖండించింది. బుధవారం ఊరూరా కాంగ్రెస్ ​పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేయాలని బీఆర్​ఎస్​ శ్రేణులకు మంత్రి కేటీఆర్​ పిలుపునిచ్చారు. మంగళవారం పలు చోట్ల రేవంత్​ దిష్టిబొమ్మలను ఆ పార్టీ నేతలు దహనం చేశారు. మంత్రులు ప్రెస్​మీట్లు పెట్టి.. వ్యవసాయానికి 3 గంటల ఉచిత విద్యుత్​ చాలని రేవంత్​ ఎట్ల అంటారని, 24 గంటల ఫ్రీ కరెంట్​ను రద్దు చేసేందుకు కాంగ్రెస్​ కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. దీనికి కాంగ్రెస్​ నేతలు కౌంటర్​ ఇచ్చారు. రేవంత్​ అనని వ్యాఖ్యలను అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. బీఆర్​ఎస్​కు వ్యతిరేకంగా బుధవారం అన్ని నియోజకవర్గాల్లోని సబ్​స్టేషన్ల వద్ద ధర్నాకు కాంగ్రెస్​ పిలుపునిచ్చింది. సీఎం కేసీఆర్​, ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి శ్రేణులు కదలిరావాలని కోరింది. అమెరికాలో ఉన్న రేవంత్​ కూడా ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. కాంగ్రెస్​ రైతు డిక్లరేషన్​తో బీఆర్​ఎస్​ పార్టీకి వెన్నులో వణుకు పుట్టిందని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. 

అమెరికాలో రేవంత్​ ఏమన్నరంటే..

అమెరికాలో జరిగిన ఎన్నారై కాంగ్రెస్​ మీటింగ్ లో ఎమ్మెల్యే సీతక్కతోపాటు పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను అక్కడివాళ్లు పలు ప్రశ్నలు వేశారు. ఆ వీడియో వైరల్​గా మారింది. 

హైకమాండ్​ దృష్టికి తీసుకెళ్తా: వెంకట్​రెడ్డి

తమ పార్టీ అధికారంలోకి వస్తే సీతక్కే సీఎం అవుతారేమోనని రేవంత్​ చేసిన కామెంట్లను కాంగ్రెస్​ నేతలు తప్పుబడుతున్నారు.  ఈ విషయాన్ని హైకమాండ్​ దృష్టికి తీసుకెళ్తామని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చెప్పారు. ‘‘గిరిజనులకే సీఎం పదవి ఇవ్వాలనుకుంటే పొదెం వీరయ్యకేం తక్కువ. ఆయన కూడా మూడోసారి ఎమ్మెల్యే అయ్యిండు. 30 ఏండ్ల నుంచి కాంగ్రెస్​ పార్టీలోనే ఉన్నడు. దళితులకు ఇస్తే దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క వంటి వాళ్లూ ఉన్నరు. బీసీల్లోనూ నేతలున్నరు” అని అన్నారు. సీతక్క సీఎం అవుతారని అనడం పెద్ద జోక్​ అని వ్యాఖ్యానించారు. ఉచిత కరెంట్​ కామెంట్లను కూడా ఆయన తప్పుబట్టారు.