కేంద్ర ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. జమిలీ ఎన్నికలపై కేంద్రానివి డ్రామాలన్నారు. సర్వేల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయని..అందుకే ఓటమి భయంతో మోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఇండియా కూటమి వన్ నేషన్, వన్ ఎలక్షన్ ను వ్యతిరేకిస్తుందన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయేకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్నారు.
కేంద్రంపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. జమిలీ ఎన్నికలపై బీఆర్ఎస్ అనుకూలమని కేసీఆర్ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. జమిలీకి అనుకూలమని 2018లోనే కేసీఆర్ కేంద్రాని లేఖ రాశారని చెప్పారు. జమిలీ ఎన్నికలను అడ్డం పెట్టుకుని రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేందుకు కేంద్రం జమిలీ ఎన్నికలకు ప్రయత్నిస్తుందన్నారు. ఈ జమిలీ ఎన్నికలు మున్ముందు అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారే అవకాశం ఉందన్నారు.
పార్లమెంట్ లో మణిపూర్ ఘటనపై ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదని.. మణిపూర్ అల్లర్లను పట్టించుకోలేదని విమర్శించారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు. మోదీ నాయకత్వంలో దేశానికి భద్రత లేదన్నారు రేవంత్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో,రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు.