- సీఎం పంటను ఎవరు కొంటరో.. వాళ్లే రైతుల పంటనూ కొనాలె: రేవంత్రెడ్డి
- గజ్వేల్ నియోజకవర్గంలో సాగిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర
మెదక్/ మనోహరాబాద్, వెలుగు: రైతులు పండించిన వడ్లను చివరి గింజ వరకు కొనాల్సిందేనని, లేకపోతే కేసీఆర్ సంగతి చూస్తామని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి హెచ్చరించారు. ‘‘యాసంగిలో రైతులను వరి వేయొద్దని చెప్పిన కేసీఆర్ తన ఫామ్హౌస్ లో మాత్రం 150 ఎకరాలలో వరి వేసిండు. ఆయన పంట ఎవడు కొంటాడో.. వాడే పేద రైతుల వరి కూడా కొనాలె” అని డిమాండ్ చేశారు. ‘‘రైతులకు ఓ నీతి.. నీకో నీతా?” అని సీఎంను ప్రశ్నించారు. రైతుల కడుపుకొట్టే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ చేపట్టిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర శనివారం సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మనోహరాబాద్ మండలం కాళ్లకల్కు చేరుకుంది. ఈ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపిన రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన వడ్లను కొనకపోతే గజ్వేల్ నడిబొడ్డున సీఎం కేసీఆర్ను ఉరితీసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతులు దాదాపు 40 లక్షల ఎకరాల్లో వరి పండించారని చెప్పారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్, మూడో టీఎంసీ మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ కోసం వేలాది ఎకరాలు గుంజుకుని పేద రైతుల బతుకులు రోడ్డుపాలు చేసిన వ్యక్తిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారు. ఆయన మాత్రం ఎర్రవల్లిలో 500 ఎకరాల భూమి కొనుక్కొని అక్కడ శత్రుదుర్భేద్యమైన గడి నిర్మించుకుని, విలాసవంతమైన జీవితం గడుపుతున్నడు” అని మండిపడ్డారు. మల్లన్నసాగర్ కోసం 14 గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాలు ముంచి పేదలు, దళితులు, గిరిజనులను నిర్వాసితులను చేశారని అన్నారు. కొండపోచమ్మ సాగర్ కట్టి ఎవరికి నీళ్లివ్వడం లేదని, కేసీఆర్ ఫాంహౌస్కు నీళ్లిచ్చేందుకు మాత్రం ప్రత్యేక కాల్వ తవ్వారని దుయ్యబట్టారు. సీఎం బంధువు కావేరి సీడ్స్ యజమాని భూమి మునగకుండా జలాశయాన్ని రీడిజైన్ చేశారని రేవంత్ ఆరోపించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ కోసం వేలాది ఎకరాలు గుంజుకోగా, ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు కోసం పేదల భూములు మళ్లీ గుంజుకునే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకు మూడు, ఐదు కోట్లు పలుకుతున్న భూములకు ప్రభుత్వం రూ.10 లక్షలు బిచ్చం ఇస్తామంటోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని చెప్పు తీసుకొని కొట్టాలన్నారు. కేసీఆర్ ఫామ్హౌస్లో 500 ఎకరాలు భూమి ఉందని, ఎకరాకు రూ.10 లక్షల చొప్పున తీస్కొని ఆ భూమిని ఇక్కడ భూములు కోల్పోయిన వారికి పంచాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి దారులకోసం, భూస్వాముల కోసం, ప్రాజెక్టుల నిర్మాణం కోసం తూతూ మంత్రంగా రైతులకు నష్టపరిహారం ఇచ్చి భూములు గుంజుకోవడంపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు.
భూ మాఫియా చెలరేగిపోతున్నది
రాష్ట్రంలో భూ మాఫియా చెలరేగిపోతున్నదని, జంట నగరాల్లో తుపాకీ తూటాలు పేలుతున్నాయని రేవంత్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న ధరణి పోర్టల్ పేదలకు యమపాశంలా తయారైందని, ఈ పోర్టల్ తీసుకొచ్చి లక్షలాది కుటుంబాలను రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను వారసులకు బదిలీ చేయకుండా నరకం చూపిస్తున్నారని తెలిపారు.