రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పెంపును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గురువారం చలో సెక్రటేరియేట్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై తెలంగాణ సచివాయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. ముందస్తు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ నేతల ఇండ్లను మోహరించి నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యులైన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క, మల్రెడ్డి రంగారెడ్డి లను గృహ నిర్బంధం చేశారు.
దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడుతూ…. తమను పోలీసులు ఎందుకు గృహ నిర్బంధం చేశారో తెలియదని అన్నారు. కేసీఆర్ 10వేల మంది తో కొండపోచమ్మ ను ప్రారంభించాని, కేటీఆర్ కూడా వేలాదిమందితో సిరిసిల్లలో హారతి కార్యక్రమం చేశారని.. మరి తమను ఏ కారణం చేత పోలీసులు అడ్డుకుంటున్నారో తెలియడం లేదని అన్నారు. పోలీస్ లు దిగజారి వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు గౌరవం లేకుండా పోయిందని అన్నారు.
కేసీఆర్ గిరిజనులను దారుణంగా మోసగించారని అన్నారు ఉత్తమ్. ఎన్టీఆర్ సింపుల్ జీవో తో గిరిజన రిజర్వేషన్లను 4శాతం నుంచి 6 శాతానికి పెంచారని, కేసీఆర్ ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. 12శాతం గిరిజన రిజర్వేషన్ ఇస్తా అన్నారా? లేదా? అని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు గిరిజనులకు ఇవ్వాలన్నారు. గిరిజనుల పోడు హక్కులను కాంగ్రెస్ కాపాడుతుందని చెప్పారు.