
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత పంచాయితీ కేసీఆర్ కుటుంబ డ్రామా అని పీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం ఆరోపించారు. కేసీఆర్ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని, ప్రజల దృష్టి మరల్చటానికే ఈ డ్రామా ఆడుతున్నారని తెలిపారు. ఆదివారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. కవిత రాసిన లెటర్ను లీక్ చేస్తే కేసీఆరే చేయాలని, వేరే వాళ్లకు లీక్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందించినం అంటున్నారని, 20 వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని చెప్పారు. ఎత్తిపోతల స్కీమ్ కాదని, డబ్బులు ఎత్తి పోసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత 10 ఏండ్లు జాగృతి పేరు మీద కవిత ప్రభుత్వ సొమ్ము వందల కోట్లు ఖర్చు పెట్టిందని మృత్యుంజయం ఆరోపించారు. రాజీవ్ గాంధీ పై కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.