హైదరాబాద్, వెలుగు: ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న కొందరు అధికారులు.. బీఆర్ఎస్ కార్యకర్తల్లా మాట్లాడు తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్, మాజీ సీఎం వైఎస్ పుణ్యమా అని ఎన్వీఎస్ రెడ్డి మెట్రో ఎండీ అయ్యారని చెప్పారు. ఆయనిప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తగా మారారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఇచ్చిన పాంప్లెట్ను ఆయన చదివారని ఫైర్ అయ్యారు. మంగళ వారం మహేశ్ కుమార్ గౌడ్ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు.
సిటీకి మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని, వైఎస్ హయాంలోనే 70% పనులు పూర్తయ్యాయని గుర్తుచేశారు. ఇప్పుడు 3 ఫేజుల్లో మెట్రోను విస్తరిస్తామంటూ చెప్తున్నా.. నిధులు ఎక్కడి నుంచి తెస్తరో మాత్రం చెప్పట్లేదన్నారు. హైదరాబాద్ ప్రజల ఓట్ల కోసమే మెట్రో పొడిగింపు డ్రామాను ఆడుతున్నారన్నారు.