- రెండు పాత కేసుల్లో నోటీసులు జారీ
- రాష్ట్రంలోనే తొలిసారి ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్
- రాజాసింగ్ పై 101 కేసులు: సీపీ ఆనంద్
హైదరాబాద్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు. ఫిబ్రవరి 19న మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా పీడీ యాక్ట్ ప్రయోగించారు. గురువారం ఆయనను అరెస్టు చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. రాష్ట్రంలోనే తొలిసారి ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ ప్రయోగించడం చర్చనీయాంశంగా మారింది. మతపరమైన కామెంట్లు చేశారనే ఆరోపణలతో ఈ నెల 23న రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ టైమ్లో 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వలేదని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించలేదని రాజాసింగ్ రిమాండ్ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. రాజాసింగ్ రిమాండ్ రిజెక్ట్ కావడంతో పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఆయనపై లోగడ నమోదైన కేసులను కొత్తగా పరిశీలించారు. పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు అనుకూలంగా ఈ ఏడాది మంగళ్హాట్, షాహినాయత్ గంజ్ స్టేషన్లలో నమోదైన కేసులు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 19న నమోదైన వివాదాస్పద వ్యాఖ్యల కేసు, శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఏప్రిల్ 12న నమోదైన కేసుల్లో గురువారం ఉదయం 11 గంటలకు 41(ఏ) సీఆర్పీసీ కింద రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు వివరణ ఇస్తానని రాజాసింగ్ చెప్పారు. ‘‘నన్ను నగర బహిష్కరణ చేయడానికి, జైలులో నిర్బంధించడానికి కుట్ర చేస్తున్నారు” అని ఆయన వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈ క్రమంలోనే ధూల్పేట్లోని రాజాసింగ్ ఇంటి వద్దకు మధ్యాహ్నం టైమ్ లో భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. సుమారు 100 మందికి పైగా రాజాసింగ్ ఇంటిని చుట్టుముట్టారు. పీడీ యాక్ట్ విధిస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య గాంధీ హాస్పిటల్కి తరలించి మెడికల్ టెస్టులు చేయించారు. అక్కడి నుంచి చర్లపల్లి జైలుకి తరలించారు. ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. చర్లపల్లి జైలు బయట కేంద్ర బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులను మోహరించారు. కాగా, నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేను అరెస్టు చేసినప్పుడు అసెంబ్లీ స్పీకర్ కు గానీ, సెక్రటరీకి గానీ పోలీసులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తమకు ఎలాంటి సమాచారం లేదని అసెంబ్లీ వర్గాలు పేర్కొన్నాయి.
బీజేపీ కార్యకర్తల ఆందోళన
రాజాసింగ్పై పీడీ యాక్ట్ ప్రయోగించారని తెలియడంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ పథకం ప్రకారమే రాజాసింగ్పై పీడీ యాక్ట్ పెట్టించారని ఆరోపించారు. గోషామహల్ నియోజకవర్గంలోని బేగంబజార్, షాహినాయత్గంజ్, ముక్తార్గంజ్, మహారాజ్గంజ్, కిషన్గంజ్లో హోల్సేల్ షాపులను మూసివేశారు. కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొజంజాహీ మార్కెట్ జంక్షన్లో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.
సిటీలో అప్రకటిత బంద్
హైదరాబాద్ లో గురువారం అప్రకటిత బంద్ కొనసాగింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం రాత్రి 8గంటల నుంచే షాపులు క్లోజ్ చేయించారు. పెట్రోలింగ్ వెహికిల్స్ తో రోమింగ్ చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకపూల్, నాంపల్లి, అబిడ్స్, కోఠి సహా గోషామహల్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లోని షాపులు మూతపడ్డాయి. ఆయా ప్రాంతల్లోని పెట్రోల్ బంకులను కూడా పోలీసులు మూసివేయించారు.
అందుకే పీడీ యాక్ట్
ఎమ్మెల్యే రాజాసింగ్ పై 2004 నుంచి మొత్తం 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 18 కమ్యూనల్ కేసులున్నాయి. మంగళ్హాట్ స్టేషన్లో రౌడీషీట్ నమోదైంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రాజాసింగ్ వివాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. 22న ‘‘శ్రీరామ్ చానెల్ తెలంగాణ’’లో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఫిర్యాదులతో కేసులు నమోదు చేశాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండడం తో చట్టపరంగా పీడీ యాక్ట్ ప్రయోగించాం. - సీవీ ఆనంద్, సీపీ, హైదరాబాద్
రిమాండ్ రిజెక్ట్ కావడంతోనే..
చిన్న చిన్న నేరాల్లో కూడా పీడీ యాక్ట్లు పెడుతున్నారు. రాజాసింగ్పై గతంలో చాలా కేసులు నమోదయ్యాయని పోలీసులే చెబుతున్నారు. 2004 నుంచి రాజాసింగ్పై ఎప్పుడూ పీడీ యాక్ట్ ప్రయోగించలేదు. కోర్టులో రిమాండ్ రిజెక్ట్ కావడంతోనే ఇలా చేశారని భావిస్తున్నాం. పీడీ యాక్ట్ పై హైకోర్టులో సవాల్ చేస్తాం.
- కరుణసాగర్, రాజాసింగ్ తరఫు లాయర్
కమిటీ చెబితేనే పెట్టాలి..
వరుసగా నేరాలు చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తారు. ఇందుకోసం మేజిస్ట్రేట్, సామాజిక వేత్త, ఎస్పీ స్థాయి అధికారితో కూడిన కమిటీకి ప్రపోజల్స్ పంపిస్తారు. ఆ కమిటీ కేసులను పరిశీలించి, సమాజానికి హాని కలుగుతుందని నిర్ధారించుకున్న తర్వాతే ఆయా వ్యక్తులపై పీడీ యాక్ట్కు ఆమోదం తెలుపుతుంది. పీడీ యాక్ట్ కింద కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండానే జైలులో రిమాండ్ చేయవచ్చు. ఈ యాక్ట్పై ఏడాది కాలం జైలులో ఉండాల్సిందే. దీనిపై హైకోర్టులో మాత్రమే సవాల్ చేయొచ్చు. - అరుణ్కుమార్, హైకోర్ట్, న్యాయవాది