
కాశీబుగ్గ, వెలుగు: మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శనివారం వరంగల్లోని ఓంకార్ భవన్ లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా మావోయిస్టుల అణచివేత పేరుతో వందలాది మంది మావోయిస్టులు, ఆదివాసీలను చంపేస్తున్నారని విమర్శించారు.
బీజేపీ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా పని చేస్తోందని మండిపడ్డారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా, మోదీ ప్రభుత్వం హత్యాకాండ కొనసాగిస్తోందని విమర్శించారు. ఆదివాసీలు, మావోయిస్టులు దేశ పౌరులు కాదా? అని ప్రశ్నించారు. వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి, చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..
వామపక్ష నేతలు, ప్రజా సంఘాల నాయకులు ఓంకార్ భవన్ నుంచి వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. కొంత సేపు పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.దీంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాలరాజు, మేకల రవి, పెద్దారపు రమేశ్, గంగుల దయాకర్, దుర్గయ్య, మల్లేశం, చందర్, రమేశ్, కుమారస్వామి, ప్రవీణ్, ప్రసాద్, బాషు మియా, జగదీశ్, రాజేందర్, భారత్, ఐలయ్య, సుమన్ ఉన్నారు.