మోకాళ్ల నొప్పుల మందు కోసం కొత్తకోటకు జనాల క్యూ

మోకాళ్ల నొప్పుల మందు కోసం కొత్తకోటకు జనాల క్యూ
  • సోషల్​మీడియాలో పోస్ట్ వైరల్​
  • కావడంతో పెరిగిన రద్దీ చెక్ ​చేయాలని పంపిణీ 
  • ఆపేయించిన వైద్యాధికారులు అయినా తరలివస్తున్న ప్రజలు 

వనపర్తి/కొత్తకోట, వెలుగు : వనపర్తి జిల్లా కొత్తకోటలో మోకాళ్ల నొప్పి తగ్గించే మందు బాగా పని చేస్తుందని ప్రచారం జరగడంతో జనం ఎగబడ్డారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో వారు వచ్చి మందుల పంపిణీ ఆపేయించారు. హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి మూడు రోజుల కింద కొత్తకోట బస్టాండ్​సమీపంలో ఉండే నాటు వైద్యుడు రాములు ఇస్తున్న ఆయుర్వేద మందు బాగా పని చేస్తోందని, తనకు తగ్గిందని సోషల్​మీడియాలో పోస్ట్​పెట్టాడు. ఇది వైరల్​కావడంతో ఒక్కసారిగా జనం తాకిడి పెరిగింది. 

దీంతో రెండు రోజుల నుంచి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తుండడంతో కొత్తకోట బస్టాండ్​ఏరియా కిక్కిరిసిపోతోంది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం మధ్యాహ్నం రాములు దగ్గరకు వెళ్లి మాట్లాడారు. తాను వనమూలికల నుంచి తీసిన మందులనే ఇస్తున్నానని చెప్పగా, ఆ మందు వల్ల దుష్ప్రభావాలు లేవని తేలేదాక మందుల పంపిణీ ఆపెయ్యాలని సూచించారు. దీంతో అప్పటికప్పుడు మందుల పంపిణీ నిలిపివేస్తున్నట్టు బోర్డు పెట్టారు. డిప్యూటీ డీఎంహెచ్​వో  శ్రీనివాసులు మాట్లాడుతూ రాములు తయారు చేస్తున్న మందును ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులకు పంపి చెక్ ​చేయిస్తామని, వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. 

పంపిణీ నిలిపివేశారని తెలియని జనాలు తరలివస్తూనే ఉండడంతో మంగళవారం కూడా కొత్తకోట రద్దీగా మారింది. ట్రాఫిక్ ​పోలీసులు రాములు దగ్గరకు వెళ్లి పోస్ట్ ​పెట్టిన వ్యక్తి వివరాలు, అడ్రస్, ఫోన్ ​నంబర్ ​అడగ్గా తనకు తెలియదని సమాధానమిచ్చాడు. మందుల పంపిణీ ఆపేసినా రూ.1500కు ఒక టోకెన్​చొప్పున మంగళవారం ఒక్కరోజే 500కు పైగా టోకెన్లు ఇచ్చినట్టు సమాచారం.