ఆరు నెలలుగా నీళ్ల కోసం జనం ఇబ్బందులు

ఆరు నెలలుగా నీళ్ల కోసం జనం ఇబ్బందులు

సమ్మయ్యనగర్​లో యూజీడీ పనులతో ధ్వంసమైన తాగునీటి పైపులైన్​
    ఆరు నెలలుగా నీళ్ల కోసం జనం ఇబ్బందులు 
    ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టని లీడర్లు, ఆఫీసర్లు
    నత్తనడకన సాగుతున్న అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులు

హనుమకొండ, వెలుగు: వరంగల్​నగరంలో వానాకాలంలో కూడా తాగునీటికి గోస తప్పడం లేదు. హనుమకొండ సమ్మయ్యనగర్ లో స్మార్ట్​ సిటీ ఫండ్స్ తో చేపట్టిన అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ(యూజీడీ) పనుల్లో ప్రధాన తాగునీటి పైపులైన్​ దెబ్బతింది. ట్యాంకర్ల ద్వారానైనా నీటిని అందించాల్సిన లీడర్లు, ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో కనీస అవసరాలకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. యూజీడీ పనులు పూర్తయితే తప్ప తాగునీటి పైపులైన్​ పునరుద్ధరించే పరిస్థితులు కనిపించడం లేదు. యూజీడీ పనులే నత్తనడకన సాగుతుండటంతో నీళ్ల కోసం ఇంకెన్నాళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

వర్క్స్ చాలా స్లో... 

రెండేండ్ల కిందట వచ్చిన వరదలు సమ్మయ్యనగర్​, అమరావతినగర్, టీవీ టవర్​కాలనీ... ఏరియాలను ముంచెత్తగా.. ముంపు నివారణ కోసం ఆఫీసర్లు అండర్​గ్రౌండ్​డ్రైనేజీ ప్రాజెక్ట్​ డిజైన్​చేశారు. స్మార్ట్ సిటీ ఫండ్స్​ రూ.54 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఫిబ్రవరి మూడో వారంలో ఇంజినీర్స్​కాలనీ వద్ద  పనులు స్టార్ట్​ చేశారు. సమ్మయ్యనగర్​ఊర చెరువు నుంచి ఇంజినీర్స్​కాలనీ ప్రెసిడెన్సీ స్కూల్​ వరకు 1.4 కి.మీ మేర పనులు చేపట్టి మే 31లో కంప్లీట్​ చేయాలని టార్గెట్​ గా పెట్టుకున్నారు.  ప్రభుత్వం నుంచి పర్మిషన్స్​లేటవడంతో పనులు కూడా లేటుగా స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం వర్షాలు కూడా మొదలవడంతో మూడు నెలల్లో పూర్తి చేస్తామన్న పనులు ఆరు నెలలైనా కంప్లీట్​ కాలేదు. దీంతో సమ్మయ్యనగర్​, చుట్టుపక్కల కాలనీవాసులకు తాగునీటితోపాటు బురదతో ఇబ్బందులు పడుతున్నారు. 

ఆరు నెలలుగా నీళ్లు బంద్​

అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనుల్లో భాగంగా సమ్మయ్యనగర్​ తులసీ బార్​ఏరియా నుంచి ప్రెసిడెన్సీ స్కూల్​ వరకున్న రోడ్డును తవ్వేశారు. ఈ ఏరియాకు వచ్చే మెయిన్ తాగునీటి పైపులైన్ ను తొలగించారు. అప్పటినుంచి సమ్మయ్యనగర్, ఇంజినీర్స్​కాలనీలకు తాగునీటి సప్లై నిలిచిపోయింది. ట్యాంకర్ల ద్వారా వాటర్​ సప్లై చేస్తామని చెబుతున్నా వారంలో ఒకట్రెండు సార్లు మినహా.. ఆ తర్వాత ట్యాంకర్లు కనిపించడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వాస్తవానికి సమ్మయ్యనగర్​కు ఇటు అమరావతినగర్, కుడా కాలనీ వైపు నుంచి టెంపరరీ గా పైపులైన్ పునరుద్ధరిస్తే సమస్య తీరిపోయే అవకాశం ఉంది. కానీ స్థానిక కార్పొరేటర్లు, గ్రేటర్​ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు.  రోజుల తరబడి నీళ్లు రాకపోవడం, సమస్యను విన్నవించినా పట్టించుకోకపోవడంతో సమ్మయ్యనగర్​వాసులు తరచూ ఆందోళనలకు దిగుతున్నారు. ఖాళీ బిందెలు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆందోళనలు చేసినప్పుడు ఒకట్రెండు రోజులు రెగ్యులర్​గా ట్యాంకర్లు పంపించి ఆ తర్వాత లైట్ తీసుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. 

నీళ్ల కోసం అరిగోస పడుతున్నం...

అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులతో సమ్మయ్యనగర్, ఇంజినీర్స్​ కాలనీతోపాటు చుట్టుపక్కల ఏరియాలకు తాగునీటి సప్లై నిలిచిపోయింది. దీంతో నీళ్లకోసం అరిగోస పడుతున్నం. వెనుక కాలనీల నుంచి టెంపరరీగానైనా ఏర్పాట్లు చేయాల్సిన  లీడర్లు, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ట్యాంకర్లు కూడా సరిగా రావడం లేదు.

- వాంకుడోతు వీరన్న, సమ్మయ్యనగర్​