న్యూఢిల్లీ: వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను కొంతమంది సీరియస్ గా తీస్కోవడంలేదని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేదన వ్యక్తంచేశారు . ‘ లాక్డౌన్ పట్ల జనం నిర్లక్ష్యంగా ఉండొద్దు. దీన్ని ఎందుకు అమలు చేశామో గుర్తుపెట్టుకోవాలి. లాక్డౌన్ను సీరియస్గా తీసుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ ఫ్యామిలీని కాపాడుకోండి. గవర్నమెంట్ సూచనల్ని సీరియస్ గా పాటించండి’ అంటూ ప్రధాని మోడీ సోమవారం ట్వీట్ చేశారు. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ ను ప్రజలు సీరియస్ గా ఫాలో అయ్యేలా రూల్స్, రెగ్యులేషన్స్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. అందరూ వాటిని అనుసరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తులో ప్రమాదం పెరుగుతుందని గుర్తించాలన్నారు. ఇటలీ, ఇరాన్, స్పెయిన్ అనుభవాలను కూడా గుర్తు తెచ్చుకోవాలని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు.
లైఫ్ టైం చాలెంజ్
కరోనా మనకు లైఫ్ టైం చాలెంజ్ అని ప్రధాని మోడీ అన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు కొత్త ఆవిష్కరణలు, పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరముందని చెప్పారు. కరోనా వైరస్ గురించి ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని మీడియాను కోరారు. సోమవారం పలు మీడియా చానెల్స్ ఎడిటర్స్తో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుత కష్టకాలంలో మీడియా వ్యవహరిస్తున్న తీరును ప్రధాని మోడీ మెచ్చుకున్నారు. ” రిపోర్టర్లు, కెమెరాపర్సన్ లు, టెక్నిషియన్లు అవిశ్రాంతంగా పనిచేస్తూ దేశానికి గొప్ప సేవ చేస్తున్నారు. పాజిటివ్ కథనాల ద్వారా ప్రజల్లో భయాందోళనలు పొగొట్టాలి. కరోనా తాత్కాలికం కాదు. లైఫ్ టైం చాలెంజ్. దీని నివారణకు కొత్త ఆవిష్కరణల అవసరం ఉంది ” అని ప్రధాని అన్నారు. కోవిడ్ 19 పై తప్పుడు ప్రచారాలను మీడియా ఎప్పటికప్పుడు కౌంటర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కంట్రోల్ కు పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు.
“పెద్ద యుద్ధం మన ముందు ఉంది. తాజా పరిణామాలు, కీలక నిర్ణయాల గురించి ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ప్రచారం చేయాలి. సోషల్ డిస్టెన్స్ పై అవేర్ నెస్ కల్పించాలి” అని వీడియో కాన్ఫరెన్స్ లో మీడియా ప్రతినిధులను కోరారు. న్యూస్ చానెల్స్ ద్వారా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించాలని, వాటికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని చెప్పారు. తప్పుడు ప్రచారాలను కౌంటర్ చేసేందుకు సైంటిఫిక్ రిపోర్ట్ తో పాటు ఎక్స్ ఫర్ట్ ఓపీనియన్స్ ను ప్రసారం చేయాలని సూచించారు. మీడియా ప్రతినిధుల నుంచి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. కరోనా అదుపులోకి వచ్చేంత వరకు తరచూ మీడియా ద్వారా ప్రజలకు ధైర్యం చెప్పాలని, కోవిడ్ నుంచి కోలుకున్న వారి అనుభవాలను ప్రజలకు తెలుపాలని మోడీకి మీడియా ప్రతినిధులు సూచించారు. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాపి చెందే అవకాశం ఉన్నందున డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేసేలా ప్రచారం చేయాలని ప్రధాని ఈ సందర్భంగా సూచించారు. మీడియా చానెల్ ప్రతినిధులు కూడా ఫీల్డ్ లో ప్రికాన్షన్స్ తీసుకోవాలని సోషల్ డిస్టెన్స్ ను కచ్చితంగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రకాశ్ జవదేకర్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్, హెల్త్ సెక్రటరీ లు పాల్గొన్నారు.