
సదాశివపేట, వెలుగు: ఇండ్ల జాగలు ఇవ్వడం లేదని పేదలు సర్కారు స్థలాన్ని కబ్జా చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం సర్వే నంబర్ 435లో 9.35 ఎకరాల గవర్నమెంట్ స్థలం ఉంది. 2014లో కాంగ్రెస్హయాంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సర్వే నంబర్390లో 5 వేల మంది నిరుపేదలకు 12 ఎకరాల్లో ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. 2014 ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయారు. టీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్ గెలుపొందారు. పంపిణీ చేసిన ఇండ్ల స్థలాలపై చింతా ప్రభాకర్ కోర్టు నుంచి స్టే తెచ్చారు. అప్పట్లో ఆ స్థలంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పారు. సంవత్సరాలు గడుస్తున్నా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకపోవడంతో పేదలు సర్వే నంబర్435లో స్థలాన్ని కబ్జా చేశారు. విషయం తెలిసి తహసీల్దార్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గవర్నమెంట్స్థలాన్ని ఆక్రమించడం తప్పని హెచ్చరించారు. ఆ పక్కనే వెంచర్ ఏర్పాటు చేసి 1.5 ఎకరాల సర్కారు స్థలాన్ని కబ్జా చేస్తున్నప్పటికి స్పందించని ఆఫీసర్లు ఇప్పుడు తమను ఆపడం ఏమిటని పేదలు మండిపడుతున్నారు.