- 190 కి చేరిన కంపెనీల సంఖ్య
- 2021 తో పోలిస్తే 2022 లో 77 శాతం పెరిగిన పెట్టుబడులు
- స్పేస్ పాలసీతో ఈ ఇండస్ట్రీకి మరింత బూస్ట్
- 2040 నాటికి 100 బిలియన్ డాలర్లకు స్పేస్ ఎకానమీ
బిజినెస్ డెస్క్, వెలుగు: చంద్రయాన్ 3 మిషన్తో మూన్పై దిగిన ఇస్రో దేశ స్పేస్ సెక్టార్ సత్తాను మరోసారి చాటింది. అయినప్పటికీ గ్లోబల్ స్పేస్ మార్కెట్లో ఇండియా వాటా ఇప్పటికీ 2 శాతం కంటే తక్కువే. 2020 ముందు వరకు ఈ సెక్టార్లోకి ప్రైవేట్ కంపెనీలకు అనుమతి లేదు. అందుకే ఈ ఇండస్ట్రీ మరింతగా విస్తరించలేకపోయిందని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. కానీ, మోదీ ప్రభుత్వం స్పేస్ ఎకానమీని పెంచడంపై ఫోకస్ పెట్టింది. గత ఐదేళ్ల నుంచి ఈ సెక్టార్లో చాలా స్టార్టప్లు పుట్టుకురావడమే దీనికి నిదర్శనం. ఈ ఏడాది ఏప్రిల్లో స్పేస్ పాలసీని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. తాజా పాలసీతో మరిన్ని స్టార్టప్లు ఏర్పాటవుతాయని అంచనా.
ఈ స్టార్టప్లు రాకెట్లు పంపుతున్నాయి..
బెంగళూరుకు చెందిన అవైస్ అహ్మద్ తన స్పేస్ స్టార్టప్ పిక్సల్ను 2019 లో మొదలు పెట్టారు. ఇందులో గూగుల్ ఇన్వెస్ట్ చేసింది. ఈ స్టార్టప్ కంపెనీ పంపే శాటిలైట్లు భూమిపై వరదలు, సునామీలు వంటి విపత్తులు సంభవించే ముందు తెలియజేస్తాయి. పిక్సల్ మాత్రమే కాదు ఇలాంటి 190 స్టార్టప్లు స్పేస్ సెక్టార్లో ఏర్పాటయ్యాయి. స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ ప్రైవేట్ రాకెట్ను లాంచ్ చేసింది. ధ్రువ స్పేస్ చిన్న శాటిలైట్లను డెవలప్ చేస్తుండగా, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ శాటిలైట్లలో వాడే ప్రొపల్షన్ను డెవలప్ చేస్తోంది. ఆద్యహ్ ఏరోస్పేస్, అగ్నికుల్, అస్ట్రోగేట్ ల్యాబ్స్, దిగంతర, గెలాక్సిఐ స్పేస్ ఇలా చాలా స్టార్టప్లు స్పేస్ సెక్టార్లో ఎదుగుతున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలను, ఇతర ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. డెలాయిట్ రిపోర్ట్ ప్రకారం, 2021తో పోలిస్తే 2022 లో ఇండియన్ స్పేస్ సెక్టార్లోకి 77 శాతం ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం, ప్రస్తుతం 8 బిలియన్ డాలర్లుగా ఉన్న స్పేస్ ఇండస్ట్రీ 2040 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకోగలదు. స్పేస్ సెక్టార్లోకి అనేక ప్రైవేట్ కంపెనీలు ఎంట్రీ ఇస్తున్నాయని అవైసి అహ్మద్ పేర్కొన్నారు.
గతంలో స్పేస్ సెక్టార్ను పట్టించుకోలేదు..
స్పేస్ సెక్టార్లోకి ప్రైవేట్ కంపెనీలను 2020 నుంచి అనుమతి ఇస్తున్నారు. అంతకు ముందు వరకు ప్రైవేట్ కంపెనీలు కేవలం ఇస్రోకి సప్లయర్లుగా మాత్రమే ఉండేవి. డైరెక్ట్గా శాటిలైట్లను అంతరిక్షానికి పంపడానికి వీలుండేది కాదు. ‘ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీలోని ప్రతీ యాక్టివిటీ ఇస్రో పర్యవేక్షణలో జరిగేది. ఈ సంస్థ ప్రతీది చూసుకునేది’ అని ఫ్రాన్స్ నేషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్లోని ఇండియన్ స్పేస్ సెక్టార్ ఎక్స్పర్ట్ ఇసబెల్లా సౌరబ్స్ పేర్కొన్నారు. కిందటేడాది బడ్జెట్లో స్పేస్ సెక్టార్ కోసం 1.9 బిలియన్ డాలర్లను ప్రభుత్వం కేటాయించింది. ఇది చైనా కేటాయింపుల కంటే ఆరు రెట్లు తక్కువ. ఫండ్స్ తక్కువ అయినప్పటికీ గతంతో పోలిస్తే కేటాయింపులు భారీగా పెరిగాయని చెప్పాలి. ఇస్రో ఈ ఏడాది ఆగస్టులో చంద్రుడి సౌత్ పోల్పై రోవర్ను ల్యాండ్ చేసింది. సూర్యుడిని విశ్లేషించేందుకు ఈ నెలలోనే ప్రోబింగ్ శాటిలైట్ను పంపింది.
స్పేస్ పాలసీతో మరింత ముందుకు
ఈ ఏడాది ఏప్రిల్లో తీసుకొచ్చిన స్పేస్ పాలసీతో ఈ సెక్టార్ మరింత విస్తరిస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ పాలసీ ప్రకారం కొంత ఫీజు చెల్లించి ఇస్రో ఫెసిలిటీలను ప్రైవేట్ కంపెనీలు వాడుకోవచ్చు. ఇంకా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయాలనుకుంటే ప్రభుత్వం సాయం చేస్తుంది. ‘గ్లోబల్ స్పేస్ ఇండస్ట్రీ సైజ్ 500 బిలియన్ డాలర్లు ఉంటుంది. ఇందులో ఇండియా వాటా 2 శాతం మాత్రమే. కొత్త స్పేస్ పాలసీతో భవిష్యత్లో ఈ వాటా 10 శాతానికి పెరగొచ్చు. స్పేస్ సెక్టార్లో మరిన్ని సంస్కరణలు రావడానికి ఈ పాలసీ సాయపడుతుంది. ప్రైవేట్ కంపెనీల పార్టిసిపేషన్ వలన దేశ స్పేస్ ఎకానమీ పెరుగుతుంది’ అని ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్ ఏకే భట్ అన్నారు. స్పేస్ ప్రోగ్రామ్ల కోసం ప్రొడక్షన్లో ఇస్రో పాల్గొనవలసిన అవసరం ఇక నుంచి ఉండదని, కొత్త టెక్నాలజీలను, సిస్టమ్లను డెవలప్ చేయడంపై ఫుల్ ఫోకస్ పెట్టొచ్చని ప్రభుత్వం పాలసీని తెచ్చిన రోజు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కామెంట్ చేశారు. ఆపరేషనల్కు సంబంధించిన విషయాలను ప్రభుత్వ సంస్థ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) చూసుకుంటుందని పేర్కొన్నారు. ఎన్ఎస్ఐఎల్తో పాటు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఇస్రోకి, ప్రభుత్వేతర సంస్థలకు మధ్య వారధిగా పనిచేస్తుంది.