- పేట్ బషీరాబాద్లో వెహికల్ను పట్టుకున్న పోలీసులు
- జీఎస్టీ అధికారుల విచారణ అనంతరం తిరిగి అప్పగింత
జీడిమెట్ల/ఎల్బీనగర్/శంషాబాద్, వెలుగు : ఓ వెహికల్లో తరలిస్తున్న రూ.9.50 కోట్ల విలువ చేసే బంగారు, వెండి, వజ్రాభరణాలను పేట్ బషీరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెహిదీపట్నంలోని మలబార్ గోల్డ్ సంస్థకు చెందిన బంగారం, వెండి, డైమండ్స్ను బొలెరో వాహనంలో దూలపల్లి మీదుగా కరీంనగర్కు తరలిస్తున్నారు. ఆ సమయంలో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పెద్ద ఎత్తున బంగారం, వెండి, డైమండ్స్ ఉన్నట్లు గుర్తించారు.
దీంతో పోలీసులు వాహనంతో పాటు అందులో ఉన్న వ్యక్తులను, ఆభరణాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. వెహికల్లో 15 కేజీల బంగారం, 11 కేజీల వెండి, 120 గ్రాముల డైమండ్స్ ఉన్నట్లుగా గుర్తించారు. వీటి విలువ రూ.9.50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని సంస్థ నిర్వహకులు చెప్పడంతో వాటిని జీఎస్టీ అధికారులకు అప్పగించారు.
వాటిని పరిశీలించిన అధికారులు అన్ని పేపర్లు సక్రమంగానే ఉన్నాయని తెలపడంతో ఆ సొత్తును తిరిగి సంస్థకు అప్పగించారు. చైతన్యపురి పీఎస్ పరిధిలోని కొత్తపేట చౌరస్తాలో ఎల్ బీనగర్ ఎస్ వోటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
కారులో తరలిస్తున్న రూ.97 లక్షల 16 వేల 865 క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ పరిధి ఆర్బీ నగర్లోఎయిర్ పోర్టు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ వ్యక్తి నుంచి రూ.9 లక్షల 93 వేలను స్వాధీనం చేసుకున్నారు.