టెక్ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ఇన్వెస్టర్, డోనాల్డ్ ట్రంప్ అతిపెద్ద సపోర్టర్ పీటర్ థీల్ సైలెంట్ గా అమెరికాను వదిలి అర్జెంటీనాకు వెళ్లిపోయాడు. కాలిఫోర్నియా ప్రభుత్వం ప్రతిపాదించిన వెల్త్ టాక్స్ భయంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం థీల్ మాత్రమే కాదు.. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ కూడా ఇప్పటికే కాలిఫోర్నియాతో తమ సంబంధాలను తెంచుకుంటున్నారు. లారీ పేజ్ ఇప్పటికే మయామిలో 71.9 మిలియన్ డాలర్ల విల్లాను కొనుగోలు చేయగా, వీరంతా తమ కంపెనీలను, ఆస్తులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఈ వలసలన్నింటికీ ప్రధాన కారణం కాలిఫోర్నియాలో రానున్న నవంబర్ బ్యాలెట్ ఓటింగ్కు రాబోతున్న ఒక కొత్త చట్టం. ఒక హెల్త్కేర్ యూనియన్ ప్రతిపాదించిన ఈ చట్టం ప్రకారం.. రాష్ట్రంలో ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తి ఉన్న ప్రతి ఒక్కరిపై 5 శాతం వన్-టైమ్ వెల్త్ టాక్స్ విధిస్తారు. ఇది జనవరి 1 నాటికి కాలిఫోర్నియాలో నివసించే ప్రతి బిలియనీర్కు వర్తిస్తుంది. ఈ భారీ పన్ను నుంచి తప్పించుకోవడానికే బిలియనీర్లు కాలిఫోర్నియాను వీడుతున్నారు. జర్మనీలో పుట్టి, అమెరికాలో పెరిగిన పీటర్ థీల్.. ఇప్పటికే న్యూజిలాండ్, మాల్టా పౌరసత్వాలను బ్యాకప్గా ఉంచుకున్నారు. ఇప్పుడు ఆయన చూపు అర్జెంటీనాపై పడింది.
థీల్ అర్జెంటీనాను ఎంచుకోవడానికి కేవలం ఆర్థిక కారణాలే కాదు.. బలమైన రాజకీయ, వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి. అర్జెంటీనా ప్రస్తుత అధ్యక్షుడు జేవియర్ మిలీ భావజాలం థీల్ ఆలోచనలకు సరిగ్గా సరిపోయింది. అనార్కో-క్యాపిటలిస్ట్ గా చెప్పుకునే మిలీకి పన్నులు, సోషలిజం అంటే అస్సలు పడదు. థీల్ ఇప్పటికే మిలీని పలుమార్లు కలిసి చర్చలు జరిపారు. అలాగే భవిష్యత్తులో రాబోయే అణుయుద్ధం, ఏఐ వల్ల తలెత్తే ముప్పుల నుంచి రక్షణ పొందడానికి అర్జెంటీనా ఒక సురక్షితమైన ప్లాన్ బి అని థీల్ భావిస్తున్నారు.
ప్రస్తుతం బ్యూనస్ ఎయిర్స్లోని ఒక విలాసవంతమైన ప్రాంతంలో భవనాన్ని కొనుగోలు చేసిన థీల్.. తన పిల్లలను స్థానిక పాఠశాలలో చేర్పించి అక్కడి లైఫ్ స్టైల్ అలవాటు పడుతున్నారు. ఇటీవల అక్కడ జరిగిన చెస్ టోర్నమెంట్లో పాల్గొని 3వ స్థానంలో నిలవడంతో పాటు, ప్రముఖ ఫుట్బాల్ మ్యాచ్లను కూడా వీక్షించారు. ఏదేమైనా, అమెరికా పన్నుల నుంచి తప్పించుకోవడానికి బిలియనీర్లు ఇలా దేశాలు దాటడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
