- హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్
- ఈఆర్వో వద్ద ఫిర్యాదు చేసుకోవాలని సూచించిన బెంచ్
హైదరాబాద్, వెలుగు: నాంపల్లి నియోజకవర్గంలోని ఓటరు లిస్ట్లో భారీగా బోగస్ ఓట్లు ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బోగస్ఓట్లను తొలగించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ను గురువారం చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాథే, జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ల డివిజన్ బెంచ్ విచారించింది.
నాంపల్లి నియోజకవర్గంలో చనిపోయిన వారి ఓట్లు10,473, బోగస్ ఓట్లు 34,997, ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసుకున్న ఓట్లు 45.5417, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు16,467 ఉన్నాయని, వాటిని అధికారులు తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఫిరోజ్ఖాన్తరఫు న్యాయవాది జుల్ఫాకర్ ఆలం కోర్టును కోరారు. స్పందించిన ధర్మాసనం వీటిపై ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో)కు ఫిర్యాదు చేయాలని పిటిషనర్కు చెప్పింది.
అభ్యంతరాలు చెప్పేందుకు గడువు ఉందని గుర్తు చేసింది. ఫిర్యాదు అందిన తర్వాత ఈఆర్వో చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బోగస్ ఓట్లను తొలగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై తాము రాజ్యాంగంలోని 226 అధికరణం కింద విచారణ చేసే పరిధి తక్కువని బెంచ్గుర్తు చేసింది.
ఈసీ తరఫు సీనియర్ లాయర్ అవినాశ్ దేశాయ్ వాదిస్తూ.. ఈఆర్సీ సెక్షన్ 2162) (ఎ) ప్రకారం ఓటర్ల జాబితా రివిజన్ ప్రక్రియ మొదలైందని, అక్కడ తేల్చుకోవాలన్నారు. పిటిషనర్ తన అభ్యంతరాలను ఈఆర్వోకు చెప్పాలన్నారు. పిటిషన్పై విచారణను క్లోజ్ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.