హైదరాబాద్, వెలుగు : ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులన్న రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 213ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. దీన్ని లాయర్ రాపోలు భాస్కర్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టనుంది. ‘‘స్థానిక, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రూల్స్ వేర్వేరుగా ఉన్నాయి. సెక్షన్ 213 ప్రకారం ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ సహా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు.
కానీ తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం కౌన్సిలర్, కార్పొరేటర్, మేయర్, చైర్మన్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు మాత్రం అలాంటి రూల్స్ ఏవీ లేవు. పల్లెల్లో జరిగే ఎన్నికలకు వర్తించే నిబంధన.. పట్టణాల్లో జరిగే ఎన్నికలకు వర్తించకపోవడం వివక్ష కిందకే వస్తుంది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం” అని పిటిషన్ లో పేర్కొన్నారు. సెక్షన్ 213ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరారు.