న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్లను జీఎస్టీ కిందకి తేవడం రాబోయే పదేళ్లలో సాధ్యం కాకపోవచ్చని బీజేపీ ఎంపీ, జీఎస్టీ కౌన్సిల్ మెంబర్ సుశీల్ కుమార్ మోడి అభిప్రాయపడ్డారు. వాటిని జీఎస్టీ కిందకి తెస్తే రాష్ట్రాలకు ఏటా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం పోతుందని చెప్పారు. కేంద్రం, రాష్ట్రాలు కలిపి ఏటా మొత్తం రూ. 5 లక్షల కోట్లను ట్యాక్సుల రూపంలో పెట్రోల్, డీజిల్లపై వసూలు చేస్తున్నాయని రాజ్యసభలో ఫైనాన్స్ బిల్పై డిస్కషన్లో మోడి పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా పెరుగుతూనే ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్ల దృష్ట్యా చూస్తే ఈ స్టేట్మెంట్ కీలకమైంది. కొన్ని రాష్ట్రాలలో పెట్రోల్ రేటు ఏకంగా రూ. 100 ని తాకింది. పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ కిందకి తెస్తే, రాష్ట్రాలకు పోయే ఆదాయం రూ. 2 లక్షల కోట్లు ఎలా వస్తుందని మోడి ప్రశ్నించారు. ఒకవేళ జీఎస్టీ కిందకి తెస్తే అత్యధిక శ్లాబ్ 28 శాతం వసూలు చేయగలుగుతారని పేర్కొన్నారు. పెట్రోలియమ్ ప్రొడక్ట్స్ రేట్లలో పన్నులకు ప్రస్తుతం 60 శాతం వాటా ఉంది. అంటే జీఎస్టీ కిందకి తెస్తే కేంద్రానికి, రాష్ట్రాలకు కలిపి రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2.50 లక్షల కోట్ల ఆదాయం పోతుందని మోడి వివరించారు. జీఎస్టీ కింద 28 శాతం చొప్పున ట్యాక్స్ వసూలు చేస్తే పెట్రోల్పై అది లీటర్కు రూ. 14 అవుతుంది. కానీ, ఇప్పుడు ట్యాక్స్ రూ. 60 దాకా ఉందని అన్నారు. పెట్రోల్ లేదా డీజిల్ లీటర్ రేటు రూ. 100 అనుకుంటే, మొత్తం రూ. 60 ట్యాక్సులు. ఇందులో రూ. 35 కేంద్ర ట్యాక్సులైతే, రూ. 25 రాష్ట్ర ట్యాక్సు. పెట్రోల్, డీజిల్లపై విధించే ట్యాక్సులు నేరుగా ప్రభుత్వ ఖజానాలోకే వెళ్తున్నాయి. ఎలక్ట్రిసిటీ, ట్యాప్ వాటర్ వంటి సదుపాయాలను ప్రజలకు అందించేందుకు ఈ రెవెన్యూనే ప్రభుత్వాలు వెచ్చిస్తాయి. లేకపోతే అలాంటి సదుపాయాలకు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని మోడి ప్రశ్నించారు. కొంత మంది జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్గా అభివర్ణించారు. కానీ జీఎస్టీ విధానంపై ఏ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లోనూ ఒక్క రాష్ట్రం కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని మోడి వెల్లడించారు. కావాలంటే జీఎస్టీ కౌన్సిల్మీటింగ్ ప్రొసీడింగ్స్ను వెరిఫై చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశంలో జీఎస్టీ విధానాన్ని అమలు చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నాయకత్వంలోని ప్రభుత్వానికి మాత్రమే దమ్ము ఉందని కూడా మోడి చెప్పారు.
ఏడాది తర్వాత మొదటిసారి తగ్గిన పెట్రోల్, డీజిల్...
సంవత్సర కాలం తర్వాత దేశంలో మొదటిసారిగా బుధవారం నాడు పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించారు. లీటర్ పెట్రోల్ రేటును 18 పైసలు, లీటర్ డీజిల్ రేటును 17 పైసలు చొప్పున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ధరలు బాగా దిగి రావడమే రేట్లు తగ్గించేందుకు కారణం. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ. 90.99కి, లీటర్ డీజిల్ రేటు రూ. 81.47 కి చేరాయి. ఆయా రాష్ట్రాలలోని వ్యాట్మీద ఆధారపడి రేట్ల తగ్గింపు ఉంటుంది. మార్చి 16,2020 తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ డీజిల్ రేటు రూ. 88.67 గా, పెట్రోల్ రేటు రూ. 94.61 గా ఉంది.