న్యూఢిల్లీ: నెలకు రూ.500 కంటే తక్కువ చందా కట్టి పీఎఫ్ స్కీము నుంచి వెళ్లిపోయిన చందాదారులకు మరో అవకాశం ఇవ్వాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) భావిస్తోంది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి లేదా ఫార్మల్ సెక్టార్ నుంచి ఇన్ఫార్మల్ సెక్టార్కు వెళ్లిపోయిన వారికి తిరిగి సభ్యత్వం ఇవ్వాలన్న ప్రపోజల్ను పరిశీలిస్తోంది. గతంలో కనీసం నెలవారీగా రూ.500 లేదా జీతంలో 12శాతం చెల్లించిన వారిని తిరిగి పీఎఫ్ ఖాతాదారులుగా మారడానికి అనుమతించే విధానంపై సమాలోచనలు జరుపుతున్నామని ఒక ఆఫీసర్ తెలిపారు. " పెన్షన్ (ఈపీఎస్), ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఈపీఎఫ్ఓ, ఉద్యోగుల డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్పై దీని ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ పని ముగిసిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటాం" అని ఆయన తెలిపారు. 2018–-20 మధ్య దాదాపు 48 లక్షల ఈపీఎఫ్ఓకు దూరమయ్యారని అంచనా. 2020లో కరోనా వచ్చినప్పుడు లక్షలాది మంది జాబ్స్కు దూరమయ్యారు. తాజా ప్రపోజల్కు గ్రీన్సిగ్నల్ వస్తే లక్షలాది మంది కార్మికులకు ఉపశమనం కలుగుతుంది. పీఎఫ్ కట్టడం మానేసిన చిన్న ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి..
సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 ప్రకారం ఈపీఎఫ్ఓ కార్మికుల సామాజిక భద్రత కోసం కొత్త కొత్త స్కీములను తీసుకురావొచ్చు. ప్రస్తుతం పరిశీలనదశలో ఉన్న కొత్త స్కీమును వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మెంబర్లకు తిరిగి పీఎఫ్లోకి వస్తే ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. అందరు ఉద్యోగులు మాదిరే రిటైర్మెంట్ కార్పస్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అత్యవసర సమయాల్లో ఈ డబ్బు నుంచి కొంత మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది. తక్కువ జీతం ఉన్న వాళ్లు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఉచితంగా ట్రీట్మెంట్లు చేయించుకోవచ్చు. ఇన్ని లాభాలు ఉండటం వల్లే ఈపీఎఫ్ఓలో చేరికలు భారీగా ఉంటున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సుమారు 15.41 లక్షల పీఎఫ్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. ఇందులో 8.95 లక్షల అకౌంట్లు కొత్తవి కావడం విశేషం. పీఎఫ్ సబ్స్క్రయిబర్లు జాబ్ మారడం వలన మరో 6.46 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. ఈ ఏడాది ఆగస్ట్తో పోల్చుకుంటే సెప్టెంబర్లో 1.81 లక్షల అకౌంట్లు ఎక్కువగా క్రియేట్ అయ్యాయి. ఆగస్ట్లో 13.60 లక్షల మంది సబ్స్క్రయిబర్లు చేరారని ఈపీఎఫ్ఓ డేటా ద్వారా తెలుస్తోంది.
యూఏఎన్తో ఆధార్ను లింక్ చేయాలె
తమ యూఏఎన్ను ఆధార్తో లింక్ చేసుకోని ఎంప్లాయీస్ అందరూ వెంటనే ఈ పని చేయాలని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. లేకుంటే ‘ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ఈసీఆర్)’ రాదు. ఫలితంగా మీ పీఎఫ్ ఖాతాల్లో వచ్చే నెల నుంచి కంపెనీ పీఎఫ్ వాటా జమ కాదు. యూఏఎన్ను ఆధార్తో లింక్ చేసుకునేలా చూడాలని ఈపీఎఫ్ఓ సంస్థల యాజమాన్యాలను కూడా కోరింది. యూఏఎన్–-ఆధార్ లింకింగ్కు ఇచ్చిన 31 ఆగస్టు 2021 వరకు ఇచ్చిన గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. ఆధార్ లింక్ కాకుంటే పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడడం వీలుకాదు. ఇన్సూరెన్స్ బెనిఫిట్లు పొందడమూ సాధ్యం కాదు.