కొరియర్‌‌ వచ్చిందంటూ..ఫోన్‌‌ హ్యాకింగ్‌‌ !

కొరియర్‌‌ వచ్చిందంటూ..ఫోన్‌‌ హ్యాకింగ్‌‌ !
  • పార్సిల్‌‌ కోసం తాము చెప్పిన నంబర్‌‌కు డయల్‌‌ చేయాలంటూ ట్రాప్​లోకి..
  • కాల్‌‌ ఫార్వార్డింగ్‌‌ ఆన్‌‌ కాగానే ఫోన్‌‌ హ్యాక్‌‌ చేస్తున్న వైనం
  • డబ్బులు కావాలంటూ బాధితుల నంబర్‌‌ నుంచే బంధువులకు మెసేజ్‌‌లు
  • నిజమేనని నమ్మి నేరగాళ్లు చెప్పిన నంబర్‌‌కు డబ్బులు పంపుతున్న వ్యక్తులు
  • అసలు విషయం తెలిసి ఖంగుతింటున్న బాధితులు

ఖమ్మం, వెలుగు : ఈజీ మనీ, అక్రమ సంపాదనకు అలవాటు పడిన సైబర్‌‌ నేరగాళ్లు ఇప్పుడు సరికొత్త రూట్‌‌ను ఎంచుకున్నారు. ఇన్నాళ్లు బ్యాంక్‌‌ కేవైసీని అప్‌‌డేట్‌‌ చేయాలి, పార్ట్‌‌టైం ఉద్యోగాలు ఇప్పిస్తాం, స్టాక్‌‌ మార్కెట్‌‌ టిప్స్‌‌, పెట్టుబడి పేరుతో మోసాలకు పాల్పడిన కేటుగాళ్లు ఇప్పుడు ఫోన్‌‌ హ్యాకింగ్‌‌కు తెర లేపారు. ప్రధానంగా ఏపీకే ఫైల్స్‌‌, కాల్‌‌ ఫార్వార్డింగ్‌‌ ట్రిక్స్‌‌ ద్వారా మోసాలకు పాల్పడడం ఇటీవల పెరిగిపోయింది. ఖమ్మం జిల్లాలోని ఇద్దరు ఆఫీసర్లు వారం రోజుల వ్యవధిలోనే సైబర్‌‌ నేరగాళ్ల బారిన పడి ఫోన్‌‌ హ్యాకింగ్‌‌కు గురి కావలం కలకలం రేపుతోంది. 

హ్యాక్‌‌ చేస్తారిలా...

సైబర్‌‌ నేరగాళ్లు తాము ఎంచుకున్న నంబర్‌‌కు వాట్సప్‌‌లో లింక్‌‌ గానీ, ఏపీకే ఫైల్స్‌‌ గానీ పంపుతారు. దానిని క్లిక్‌‌ చేయగానే హ్యాకింగ్‌‌కు సంబంధించిన యాప్‌‌ ఫోన్‌‌లో ఇస్టాల్‌‌ అవుతుంది. దాని ద్వారా హ్యాకింగ్‌‌కు గురైన వ్యక్తి ఫోన్‌‌కు వచ్చే ఎస్‌‌ఎంఎస్‌‌లు, ఓటీపీలు సైబర్‌‌ నేరగాళ్లు తెలుసుకుంటూ.. తమ ఫోన్లలో అదే నంబర్‌‌పై వాట్సప్‌‌ను రిజిస్టర్‌‌ చేసుకుంటారు. దీని వల్ల హ్యాకింగ్‌‌ గురైన వ్యక్తి ఫోన్‌‌లో వాట్సప్‌‌ లాగవుట్‌‌ అవుతుంది. తర్వాత అదే నంబర్‌‌ నుంచి ‘నా యూపీఐ పనిచేయడం లేదు.. 

అర్జంట్‌‌గా డబ్బులు కావాలి’ అంటూ తమ యూపీఐ నంబర్‌‌ను ఇచ్చి వాట్సప్‌‌లో ఉన్న కాంటాక్ట్స్‌‌కు మెసేజ్‌‌ పెడుతారు. మెసేజ్‌‌ వచ్చిన నంబర్‌‌ తమకు తెలిసిన వ్యక్తిదే కావడంతో నిజమేనని భావించిన అవతలి వ్యక్తులు మెసేజ్‌‌లో సైబర్‌‌ నేరగాళ్లు చెప్పిన నంబర్‌‌కు డబ్బులు పంపిస్తుంటారు. దీంతో ఆ డబ్బులన్నీ సైబర్‌‌ నేరగాళ్ల అకౌంట్‌‌లోకి వెళ్లిపోతుంటాయి.

మరో పద్ధతిలో.. సైబర్‌‌ నేరగాళ్లు తాము అనుకున్న నంబర్‌‌కు ఫోన్‌‌ చేసి ‘మీకు కొరియర్‌‌ వచ్చింది.. కానీ మిమ్ములను కాంటాక్ట్‌‌ కావడం వీలు కావడం లేదు.. కాబట్టి *21* తర్వాత తాము చెప్పే నంబర్‌‌ ఎంటర్‌‌ చేశాక # నొక్కి డయల్‌‌ చేయండి’ అని చెబుతున్నారు. దీంతో నిజమేనని నమ్మిన వారు సైబర్‌‌ నేరగాళ్లు చెప్పినట్లే చేయడంతో సదరు వ్యక్తికి సంబంధించిన కాల్స్‌‌, మెసేజ్‌‌లు అన్నీ సైబర్‌‌ నేరగాళ్లు చెప్పిన నంబర్‌‌కు ఫార్వార్డ్‌‌ అవుతాయి. అలా కాల్స్‌‌, మెసేజ్‌‌ ద్వారా ఫోన్‌‌ను హ్యాక్‌‌ చేసి డబ్బులు కావాలంటూ అతడి కాంటాక్ట్స్‌‌లో ఉన్న నంబర్లకు మెసేజ్‌‌లు పెడుతున్నారు. తీరా బాధితుడు అసలు విషయాన్ని గుర్తించి దానిని సరిచేసుకునేలోపే.. కొందరు వ్యక్తులు డబ్బులు పంపిస్తుండడంతో నష్టపోతున్నారు. 

ఖమ్మం జిల్లాలో 10 నెలల్లో 330 సైబర్‌‌ మోసాలు

ఈ ఏడాది పది నెలల్లోనే ఖమ్మం జిల్లా పరిధిలోని వివిధ పోలీస్‌‌స్టేషన్లలో సుమారు 330 సైబర్ మోసాలకు సంబంధించి కేసులు నమోదు కాగా, నేరగాళ్లు దాదాపు రూ.14 కోట్లు కొల్లగొట్టారు. నష్టపోయిన 24 గంటల్లోపు సైబర్ క్రైమ్‌‌ను ఆశ్రయించడంతో రూ. నాలుగు కోట్ల వరకు రికవరీ చేయగలిగారు. మరో రూ.20 లక్షలను మోసగాళ్లు డ్రా చేసుకోకుండా వారి అకౌంట్లను 
హోల్డ్‌‌ చేశారు.

ఖమ్మం జిల్లా ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు చెందిన ఓ రిటైర్డ్‌‌ ఆఫీసర్‌‌కు ఇటీవల ఓ గుర్తు తెలియని నంబర్‌‌ నుంచి ఫోన్‌‌ వచ్చింది. ఫోన్‌‌ చేసిన వ్యక్తులు ‘మీకు కొరియర్‌‌ వచ్చింది.. మిమ్ములను కాంటాక్ట్‌‌ చేయడానికి వీలు కావడం లేదు.. కొరియర్‌‌ తీసుకునేందుకు *21* తర్వాత మేము చెప్పిన ఫోన్‌‌ నంబర్‌‌ ఎంటర్‌‌ చేసి # నొక్కి డయల్‌‌ చేయండి’ అని చెప్పారు. నిజమేనని నమ్మిన సదరు ఆఫీసర్‌‌ వారు చెప్పినట్లే చేశాడు. తర్వాత ఆ ఆఫీసర్‌‌ నంబర్‌‌ నుంచి ‘నా యూపీఐ పనిచేయడం లేదు.. ఫోన్‌‌ పే ద్వారా మరో నెంబర్‌‌కు రూ. 60 వేలు పంపండి’ అంటూ అతడి బంధువులు, ఫ్రెండ్స్‌‌కు మెసేజ్‌‌ వెళ్లింది. దీంతో అతడి దగ్గరి బంధువులు కొందరు ఆన్‌‌లైన్‌‌ ద్వారా డబ్బులు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేశారు. మరో గంట తర్వాత అదే మొబైల్‌‌ నంబర్‌‌ నుంచి ‘నా ఫోన్‌‌ హ్యాక్‌‌ అయింది.. ఎవరూ డబ్బులు పంపొద్దు’ అని ఆ ఆఫీసర్‌‌ మెసేజ్‌‌ చేయడంతో డబ్బులు పంపిన వారు షాక్‌‌కు గురయ్యారు.


ఖమ్మం జిల్లాలోని ఐడీఓసీ డిపార్ట్‌‌మెంట్‌‌లో పనిచేస్తున్న ఓ జిల్లా స్థాయి ఆఫీసర్‌‌ నుంచి మూడు రోజుల కింద ఓ కింది స్థాయి ఉద్యోగికి వాట్సప్‌‌లో ఓ మెసేజ్‌‌ వచ్చింది. ‘నాకు అర్జంట్‌‌గా రూ.55 వేలు పంపించాలి, రెండు గంటల్లో తిరిగి ఇచ్చేస్తాను’ అని మెసేజ్‌‌లో కనిపించింది. అయితే శాఖాపరమైన అంశాల్లో సమాచారం కోసం తప్పితే.. తనతో పెద్దగా పరిచయం లేని ఆఫీసర్ నుంచి మెసేజ్ రావడంతో అనుమానం వచ్చిన ఉద్యోగి మరో ఎంప్లాయ్‌‌కి ఫోన్‌‌ చేసి ఆరా తీశాడు. దీంతో ‘ఆ మహిళా ఆఫీసర్‌‌  ఫోన్‌‌ హ్యాక్‌‌ అయింది.. ఆమె ఫోన్‌‌లోని అన్ని కాంటాక్ట్‌‌ నంబర్లకు ఇలాగే మెసేజ్‌‌ వచ్చింది, డబ్బులు పంపొద్దు’ అని సమాధానం వచ్చింది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మొబైల్‌‌ హ్యాక్‌‌ అయిందని అనుమానం వచ్చిన వెంటనే సెట్టింగ్స్‌‌లోకి వెళ్లి కాల్ ఫార్వార్డింగ్‌‌ను డిజేబుల్‌‌ చేయాలి.
  •  తెలియని, అనుమానాస్పద యాప్స్‌‌ను ఇన్‌‌స్టాల్‌‌ చేసుకోకూడదు.
  •  ఫోన్‌‌లో ఫ్యాక్టరీ రిసెట్‌‌ చేసుకుంటే హ్యాకింగ్‌‌ బారి నుంచి తప్పించుకోవచ్చు.
  •  యాప్స్‌‌ను లింక్‌‌లు, ఏపీకే ఫైల్స్‌‌ నుంచి కాకుండా.. ప్లే స్టోర్‌‌, యాప్‌‌ స్టోర్‌‌ నుంచి మాత్రమే డౌన్‌‌లోడ్‌‌ చేసుకోవాలి.
  •  ట్సాప్‌‌కు టూ స్టెప్‌‌ వెరిఫికేషన్‌‌ ఆన్‌‌ చేసుకుంటే హ్యాక్‌‌కు గురికాకుండా కాపాడుకోవచ్చు.
  •  సైబర్‌‌ మోసాలకు గురైతై వెంటనే 1930కి కాల్‌‌ చేయడంతో పాటు www. cybercrime.gov. in వెబ్‌‌సైట్‌‌లో ఫిర్యాదు చేయాలి.