
- 4 జిల్లాల కలెక్టర్లు, వారి సీసీల ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్
- ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్ల ఫోన్లు కూడా
- అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు, ట్యాపింగ్కు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు
- మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్లపై నిఘా
- త్వరలో నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్లు రికార్డు చేయనున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న కోట్లు విలువ జేసే ప్రభుత్వ, వివాదాస్పద భూములను కొట్టేసేందుకు సైతం ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నట్లు సిట్ దర్యాప్తులో తాజాగా వెలుగుచూసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్ల ఫోన్లను ప్రభాకర్రావు టీం ట్యాప్ చేసినట్లు ఇప్పటికే సిట్ ఆధారాలు సేకరించింది. తాజాగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, జనగాం జిల్లా కలెక్టర్లు, వాళ్ల క్యాంప్ క్లర్క్(సీసీ)లు, జిల్లా రెవెన్యూ అధికారుల ఫోన్లను కాల్డిటైల్రికార్డ్(సీడీఆర్) ఆధారంగా ప్రభాకర్రావు టీమ్ ట్యాప్చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. గత సర్కారు హయాంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ, భూదాన్, వక్ఫ్ భూముల అన్యాక్రాంతమైన సంగతి తెలిసిందే. పలు ప్రైవేట్ వివాదాస్పద భూములకు సంబంధించి కోట్లలో సెటిల్మెంట్లు జరిగాయనే ఆరోపణలున్నాయి.
మరో వైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతం బయటపడింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, అప్పటి మహేశ్వరం తహసీల్దార్జ్యోతి, ఇతర అధికారులపై ఏసీబీ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో రియల్టర్లు, డెవలపర్లు, రెవెన్యూ అధికారుల ఫోన్లు ఎందుకు ట్యాప్చేశారు? వారి నుంచి ఎలాంటి సమాచారం సేకరించారు? ఆ సమాచారం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందారు? అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములకు, ధరణిలో మార్పుచేర్పులకు, ఈ ఫోన్ట్యాపింగ్కు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత ఐఏఎస్లు, వారి సీసీలకు నోటీసులు ఇచ్చి.. త్వరలోనే వాంగ్మూలాలు రికార్డు చేయనున్నట్లు తెలిసింది.
119 మంది కాంగ్రెస్ అభ్యర్థుల ఫోన్లూ ట్యాప్
మునుగోడు, హుజూరాబాద్ బై ఎలక్షన్స్తోపాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీడీపీ నేత కాసాని జ్ఞానేశ్వర్, వారి అనుచరుల ఫోన్లను ప్రణీత్రావు టీమ్ ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. వీరి నుంచి కూడా త్వరలోనే స్టేట్మెంట్లు తీసుకోనున్నట్లు తెలిసింది. కాగా, వీరి కాల్ డిటైల్ రికార్డ్ (సీడీఆర్), ఇంటర్నెట్ ప్రొటోకాల్ డిటైల్ రికార్డ్ (ఐపీడీఆర్)లను కేసులో నిందితుడైన మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న సేకరించి, సీడీఆర్ ఆధారంగా వారి కదలికలపై స్థానిక పోలీసులతో నిఘా పెట్టినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సీడీఆర్ అనాలసిస్ ద్వారా క్రియాశీల కార్యకర్తలు, ఆర్థిక వనరులు సమకూర్చే వారి ఫోన్ నంబర్లను తిరుపతన్న ద్వారా ప్రణీత్ రావుకు చేరేవి. ఇలా అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం119 మంది కాంగ్రెస్ అభ్యర్థుల ఫోన్ నంబర్లనూ ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది.
కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి నా ఫోన్లు ట్యాప్: గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
సిట్ కు స్టేట్మెంట్లు ఇచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ బాధితులు క్యూ కడుతున్నారు. ప్రతిరోజూ 8 నుంచి 10 మంది సాక్షుల వద్ద సిట్ అధికారులు వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నారు. నిందితుడు ప్రణీత్రావును విచారిస్తూనే సాక్షుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రణీత్రావును బుధవారం 9 గంటలపాటు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ నేత, టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టీఈఆర్ఐఈఎస్ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి సిట్ ముందు హాజరయ్యారు. సిట్ అధికారులు దాదాపు గంటపాటు వీరి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి, ఫహీం ఖురేషీ అనుచరుల ఫోన్ నంబర్లను తెలుసుకున్నారు. ట్యాపింగ్ లిస్ట్లో ఆయా నంబర్లు ఉన్న వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేయనున్నారు.
వాంగ్మూలం ఇచ్చిన అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి తన ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కూడా సిట్ నోటీసులు అందించినట్లు తెలిసింది. బాధితులుగా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మర్రి శశిధర్రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, తాటికొండ రాజయ్యతోపాటు ఐఏఎస్లు రోనాల్డ్ రాస్, గౌతం అంగీకారం మేరకు వాంగ్మూలం తీసుకోనున్నారు.