
- నా ఫోన్ ట్యాప్ చేసి ఇబ్బంది పెట్టిన్రు
- సీఎంలుగా ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేసిన్రు
- తోడబుట్టిన చెల్లె అని కూడా చూడలేదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది పచ్చి నిజమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. ఇది కేసీఆర్, జగన్ జాయింట్ ఆపరేషన్ అని ఆరోపించారు. తన భర్తతో పాటు సన్నిహితుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాప్ చేశాక ఆడియోను తనకే వినిపించారని తెలిపారు. సీఎంలుగా ఉన్నప్పుడు కేసీఆర్, జగన్ కలిసి ఎన్నో అరాచకాలు చేశారని ఫైర్ అయ్యారు.
వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో బుధవారం (june 18) షర్మిల మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్, జగన్ చేసిన అరాచకాల్లో ఫోన్ ట్యాపింగ్ చాలా చిన్నది. వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయింది. తెలంగాణ రాజకీయాల్లో నేను యాక్టివ్గా ఉన్నప్పుడు నా భవిష్యత్తును పాతిపెట్టాలని చూసిన్రు. నేను జగన్కు తోడబుట్టిన చెల్లెల్ని. ఆ విషయం మరిచి నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదు అని కుట్ర చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది పచ్చి నిజం.
నా ఫోన్ ట్యాప్ అయినట్లు వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చి చెప్పారు. ట్యాప్ చేసిన ఒక ఆడియోను వినిపించారు. ఫోన్ ట్యాపింగ్కు కేసీఆర్, కేటీఆర్, జగన్ సూత్రధారులు. ఈ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తా. బైబిల్ మీద ప్రమాణం చేసి ఎవర్ని అయినా ఎదుర్కొంటా. అప్పుడే తెలిసినా.. ఏం చేయలేని పరిస్థితి నాది. నాకు మద్దతు తెలిపినవాళ్లను కూడా బెదిరించారు. తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్కు ఇష్టం లేదు. కేసీఆర్ కోసం నన్ను తొక్కిపెట్టాలని జగన్ చూశారు’’అని షర్మిల అన్నారు.