
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఎస్ఐబీ మాజీ చీఫ్
- అమెరికా నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్కు..
- ఇమిగ్రేషన్ ప్రాసెస్ తర్వాత తన నివాసానికి
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి దుబాయ్ మీదుగా ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ ఔట్ సర్క్యులర్ అమల్లో ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన వద్ద ఉన్న సుప్రీం కోర్టు ఆర్డర్, వన్ టైం ఎంట్రీకి అనుబంధమైన ఎమర్జెన్సీ సర్టిఫికెట్ సహా ఇతర డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి సమాచారం ఇచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్లోని సిట్ ఆఫీస్కు చేరుకుంటారు. వెస్ట్జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సహా ఐదుగురు సభ్యుల బృందం ప్రభాకర్ రావును విచారిస్తుంది. సిట్ విచారణలో ఆయన ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది.
50 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన ప్రణీత్ రావు టీమ్
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తున్నదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావడంతో నవంబర్ 30న ఆపరేషన్ టార్గెట్స్ ఆపేశారు. 2023, డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశాడు. ఎస్ఐబీ లాగర్ రూమ్ను ధ్వంసం చేయాలని ప్రణీత్ రావును ఆదేశించాడు. దీంతో ప్రణీత్ రావు టీమ్ అదే రోజు రాత్రి 7:30 నుంచి 8:15 మధ్య సీసీ టీవీ కెమెరాలు ఆఫ్ చేసి 50 కంప్యూటర్ల హార్డ్ డిస్క్లు, సర్వర్లను మార్చేశాడు. వాటి స్థానంలో వేరే హార్డ్డిస్క్లు ఏర్పాటు చేశారు. ఎస్ఐబీ డేటా ఉన్న 50 హార్డ్ డిస్క్లను ముక్కలు ముక్కలుగా కట్ చేసి నాగోల్లోని మూసి బ్రిడ్జి కింద తగులబెట్టారు.
ఎస్ఐబీ లాగర్ ధ్వంసంపై డీఎస్పీ డి.రమేశ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిరుడు మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఆ మరుసటి రోజే ప్రభాకర్ రావు.. తన భార్యతో చెన్నై వెళ్లాడు. అక్కడి నుంచి అమెరికా వెళ్లిపోయాడు. లండన్కు పారిపోయిన మరో నిందితుడు ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్రావుకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. సీసీఎస్లో నమోదైన కేసులో ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. రెండో నిందితుడైన ప్రణీత్రావు సహా మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సిటీ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును నిరుడు మార్చిలోనే సిట్ అరెస్ట్ చేసింది. వీరికి 10 నెలల పాటు బెయిల్ లభించలేదు.
గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫోన్ ట్యాపింగ్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ కేంద్రంగా ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు సిట్కు తెలిపిన వివరాల మేరకు.. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ రావును మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీగా బాధ్యతలు అప్పగించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్గా నియమించారు. ఆ తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ (ఎస్వోటీ) టీమ్ను ఏర్పాటు చేశారు. దీనికి ప్రణీత్ రావు చీఫ్గా పని చేశారు. బీఆర్ఎస్ సర్కార్కు వ్యతిరేకంగా పనిచేసే సొంత పార్టీ నేతలు సహా కాంగ్రెస్, బీజేపీ, వ్యాపారవేత్తలు, పౌరహక్కుల నేతలు చివరకు జడ్జిల ఫోన్లను ట్యాప్ చేశారు. బేగంపేట్లోని ఎస్ఐబీ ఆఫీస్ కేంద్రంగా ఎస్వోటీకి ప్రత్యేక గదులు కేటాయించారు. కేసీఆర్, సీఎంవో, ప్రభాకర్ రావు అందించిన వివరాలతో ప్రణీత్ రావు సుమారు 4,200కి పైగా ఫోన్ నంబర్లతో ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు.