
- గతంలో యాప్ ద్వారా లాక్ చేసే వారు..
- త్వరలో ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు వెలువడే అవకాశం
న్యూఢిల్లీ:
బ్యాంకుల నుంచి, ఎన్బీఎఫ్సీల నుంచి కన్స్యూమర్ లోన్ తీసుకొని మొబైల్ ఫోన్ కొన్నారా? తిరిగి అప్పు చెల్లించలేకపోయారా? అయితే త్వరలో ఇవి మీ ఫోన్ను రిమోట్గా లాక్ చేయొచ్చు. క్రెడిట్పై కొన్న మొబైల్ ఫోన్లను డిఫాల్ట్ అయిన వినియోగదారుల నుంచి రికవరీ చేయడానికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు రిమోట్ లాక్ చేసే అధికారం ఇవ్వాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ ) చూస్తోంది. 2024లో హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ రిపోర్ట్ ప్రకారం, మొబైల్ ఫోన్లు సహా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్లో మూడో వంతు వస్తువులను లోన్లపై వినియోగదారులు కొంటున్నారు.
దేశంలో 116 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉండటంతో ఫైనాన్స్పై ఫోన్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. గత సంవత్సరం ఆర్బీఐ ఫోన్ లాక్ చేయడాన్ని నిలిపేయాలని సూచించింది. అప్పట్లో లోన్ ఇచ్చే సమయంలో యాప్ ద్వారా ఫోన్లను లాక్ చేసేవారు. ఇప్పుడు ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్లో మార్పులు చేసి, లాక్ విధానానికి స్పష్టమైన మార్గదర్శకాలను ఆర్బీఐ ఇవ్వనుంది.
వినియోగదారుల హక్కులు..
ఫోన్ లాక్ చేయాలంటే వినియోగదారుల ముందస్తు అంగీకారం తప్పనిసరి. లాక్ అయిన ఫోన్లో వ్యక్తిగత డేటా యాక్సెస్ చేయడం నిషేధం. చిన్న లోన్ల రికవరీకి బ్యాంకులకు అధికారం ఇవ్వాలని ఆర్బీఐ చూస్తున్నప్పటికీ, కస్టమర్ డేటాను రక్షించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే బజాజ్ ఫైనాన్స్, డీఎంఐ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ వంటి ఎన్బీఎఫ్సీల రికవరీ వేగవంతం అవుతుంది.
ఇండియాలోని ఎన్బీఎఫ్సీల్లో 85శాతం కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లను అందిస్తున్నాయి. ఇవి ఇచ్చే రూ. ఒక లక్ష లోపు లోన్లు ఎక్కువగా డిఫాల్ట్ అవుతున్నాయి. క్యాష్లెస్ కన్స్యూమర్ ఫౌండర్ శ్రీకాంత్ ఎల్. ప్రకారం, “ఈ విధానం వలన వినియోగదారులు రీపేమెంట్ చేసేంతవరకు తమ ఫోన్ను యాక్సెస్ చేసుకోలేరు. ఉద్యోగం, విద్య, ఫైనాన్షియల్ సేవలు వంటి వాటికి దూరం అవుతారు” అని అన్నారు. ఇది వినియోగదారుల హక్కులు, రికవరీ హక్కుల మధ్య కీలక చర్చకు దారితీయొచ్చని చెప్పారు.