ఖమ్మం నగరంలోని పోలీస్​ పరేడ్​ గ్రౌండ్స్​లో జనవరి 3 వరకు ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్​

ఖమ్మం నగరంలోని పోలీస్​ పరేడ్​ గ్రౌండ్స్​లో జనవరి 3 వరకు  ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్​
  • జనవరి 3 వరకు ఫిజికల్​ టెస్టులు 
  • అడ్మిట్ కార్డు ఉన్న వారికే ఎంట్రీ
  • హాజరుకానున్న 24,733 మంది అభ్యర్థులు
  • లేటెస్ట్  టెక్నాలజీతో మరింత పారదర్శకత

ఖమ్మం, వెలుగు: పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా ఫిజికల్ ఎఫిసెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు గురువారం ప్రారంభమవుతున్నాయి. నగరంలోని పోలీస్​ పరేడ్​ గ్రౌండ్స్​లో జనవరి 3 వరకు జరిగే ఈవెంట్స్​కు ఉమ్మడి జిల్లా నుంచి 24,733 మంది హాజరుకానున్నారు. వీరిలో 20,033 మంది పురుషులు, 4,700 మంది మహిళలున్నారు. మొదటి రోజు 600 మంది అటెండ్ కానున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్​ నిర్వహించారు. ఎలాంటి అవకతవకలు, తప్పులకు ఆస్కారం లేకుండా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. బయో మెట్రిక్, ప్రతి అభ్యర్థి చేతికి చిప్​తో కూడిన రిస్ట్ బ్యాండ్, డిజిటల్​ చిప్​తో ఉన్న ఆర్ఎఫ్ఐడీ జాకెట్స్​ను అటాచ్​ చేయనున్నారు. వీటి ద్వారా ఈవెంట్స్​ పారదర్శకంగా జరిగేలా ప్లాన్​ చేశారు. 

ప్రక్రియ సాగేదిలా..

ముందుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని శివాలయం దగ్గర పోలీస్ సిబ్బంది అడ్మిట్ కార్డు ఉన్న అభ్యర్థులకు టోకెన్ నెంబర్ ఇచ్చి పోలీస్ కళ్యాణ మండపంలోకి అనుమతిస్తారు. అక్కడ డాక్యుమెంట్  పరిశీలన ఉంటుంది. బయోమెట్రిక్  తర్వాత రిస్ట్ బ్యాండ్, ఆర్ఎఫ్ఐడీ జాకెట్స్​ అటాచ్  చేసుకున్న పురుష అభ్యర్థులకు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు నిర్వహిస్తారు. నిర్ణీత సమయంలో రన్నింగ్ కంప్లీట్ చేసిన వారి ఎత్తు కొలుస్తారు. నిర్ణీత ఎత్తు ఉన్న వారిని లాంగ్ జంప్, షాట్ పుట్ పోటీలకు అనుమతిస్తారు. ఈవెంట్ల దగ్గర సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. వాటిని పోలీస్​ కమాండ్​ కంట్రోల్  సెంటర్లతో అనుసంధానించారు. ఈవెంట్ల తీరును పర్యవేక్షించేందుకు ఏసీపీ స్థాయి అధికారిని నియమించినట్టు సీపీ విష్ణు వారియర్​ తెలిపారు. అభ్యర్థులు రిక్రూట్​మెంట్ బోర్డు కేటాయించిన తేదీలలో హజరు కావాలని, తమతో పాటు అడ్మిట్ కార్డ్, ఇంటిమేషన్ లెటర్, డాక్యుమెంట్స్, పార్ట్–2 అప్లికేషన్  నుంచి సంబంధిత సర్టిఫికెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటో కాపీలను తీసుకురావాలన్నారు. 

దళారుల ప్రమేయం లేకుండా..

మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పోలీస్​ పరేడ్​ గ్రౌండ్స్​ పరిసరాల్లో పూర్తి స్థాయిలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. 355 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ టీమ్​లో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, 11 మంది ఏసీపీలు, 17 మంది సీఐలు, 31 మంది ఎస్ఐలు, 8 మంది మహిళా ఎస్ఐలు, 55 మంది ఏఎస్ఐ,  హెడ్​ కానిస్టేబుళ్లు, 230 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డ్  ఆఫీసర్లు- బందోబస్తు డ్యూటీలో పాల్గొంటారు. అభ్యర్థులంతా ఉదయం 5 గంటలకు ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకుని క్యూలైన్​లో నిలబడి టోకెన్​ పొందాలి. పరేడ్​గ్రౌండ్​లో మెడికల్ టీమ్, షామియానాలు, మంచినీరు, మొబైల్  టాయిలెట్స్  ఏర్పాటు చేశారు. 

అభ్యర్థులకు సూచనలు..

  •     అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులో ఇచ్చిన సమయం, తేదీలో రిపోర్ట్​ చేయాలి. సమయపాలన పాటించాలి. 
  •     అడ్మిట్ కార్డ్, ఇంటిమేషన్ లెటర్, అభ్యర్థి సంతకం చేసిన పార్ట్-2 అప్లికేషన్  ప్రింట్- అవుట్ తీసుకురావాలి.
  •     ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్  సెల్ఫ్ అటెస్టెడ్​ ఫొటో కాపీ తెచ్చుకోవాలి.
  •     అభ్యర్థులు ఉదయం 5 గంటలకే పరేడ్ గ్రౌండ్​ కు చేరుకోవాలి. 
  •     దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. ఎవరైనా ఉద్యోగాలిప్పిస్తామని చెబితే, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి. 
  •     అనవసరమైన వ్యక్తిగత వస్తువులను తీసుకురావద్దు. 
  •     మహిళలు ఆభరణాలు, హ్యాండ్​ బ్యాగులు, పౌచ్​లను వెంట తెచ్చుకోవద్దు. మొబైల్ ఫోన్లను అనుమతించరు. 
  •     బయోమెట్రిక్ డేటా ఆధారంగా అభ్యర్థుల గుర్తింపు ధృవీకరణ ఉంటుంది. మెహంది, పచ్చబొట్లు బయోమెట్రిక్​ ధృవీకరణకు ఆటంకం కలిగించేలా ఉండొద్దు.