గచ్చిబౌలి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై నలుగురు ఎమ్మెల్యేల పిల్

గచ్చిబౌలి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై నలుగురు ఎమ్మెల్యేల పిల్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ గచ్చిబౌలిలోని సర్కార్‌‌‌‌ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ నలుగురు అధికార కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు హైడ్రా, ఇతర ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ చర్యలు లేవని పిల్‌‌‌‌లో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం సర్వే నంబర్‌‌‌‌ 27లోని 27.18 ఎకరాల సర్కార్‌‌‌‌ భూమిలో ప్రైవేట్‌‌‌‌ వ్యక్తులు 47 అంతస్తుల టవర్లు 8 నిర్మిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్​రెడ్డి (జడ్చర్ల), యెన్నం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి (మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌), భూక్యా మురళీనాయక్‌‌‌‌(మహబూబాబాద్‌‌‌‌), కూచుకుళ్ల రాజేశ్‌‌‌‌రెడ్డి (నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 


ఈ పిల్‌‌‌‌పై యాక్టింగ్‌‌‌‌ చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ సుజయ్‌‌‌‌పాల్, జస్టిస్‌‌‌‌ రేణుకా యారా డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌‌‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌‌‌‌ వాదనలు వినిపిస్తూ..  పోరంబోకు భూమిగా కాస్రా పహాణీలో పేర్కొన్న 27.18 ఎకరాల సర్వే నంబర్‌‌‌‌ మార్చి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌‌‌ ఎన్‌‌‌‌వోసీ ఇచ్చారన్నారు. అనంతరం జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులు అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని చెప్పారు. అది సర్కార్‌‌‌‌ భూమి అని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రం సమర్పించినా ఫలితం లేదని నివేదించారు. 

సర్వే నంబర్​లేకుండా చర్యలెలా..?

వినతిపత్రాన్ని పరిశీలించిన హైకోర్టు.. సర్వే నంబర్‌‌‌‌ లేకుండా వినతిపత్రం ఇచ్చారని గుర్తించింది. వినతిపత్రంలో వివరాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరితే ఎలాగని ప్రశ్నించింది. సర్వే నంబర్‌‌‌‌ ఇతర వివరాలతో మరోసారి వినతిపత్రం ఇవ్వాలని ఎమ్మెల్యేలను ఆదేశించింది. సర్కార్‌‌‌‌ భూమి నంబరు మార్పు చేసి అక్రమంగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే వినతిపత్రంలో సర్వే నంబర్‌‌‌‌ లేదని పిటిషనర్‌‌‌‌ న్యాయవాది కూడా అంగీకరించారు. దీనిపై డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ స్పందిస్తూ, వినతి పత్రంలో సర్వే నంబర్‌‌‌‌ వివరాలు లేకుండా ఇస్తే ఎలాగని  ప్రశ్నించింది. 

హైదరాబాద్, గచ్చిబౌలి అంటే చాలా విస్తీర్ణం ఉంటుందని, ఆఫీసర్లు ఎక్కడికి వెళ్లి అక్రమ నిర్మాణాలు పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని ప్రశ్నించింది. ఫలానా ప్రభుత్వ భూమిలో ప్రైవేట్‌‌‌‌ వ్యక్తులు నిర్మాణాలు చేస్తున్నారని తెలియజేయకపోతే ఆఫీసర్లు ఎలా చర్యలు తీసుకోగలరని ప్రశ్నించింది. భూమి సర్వే నంబర్‌‌‌‌ లేకుండా వినతిపత్రం ఇవ్వడం వల్ల ఉపయోగం ఏముటుందని కూడా ప్రశ్నించింది. సర్వే నంబర్‌‌‌‌తో సమగ్ర వివరాలతో సంబంధిత ఆఫీసర్లకు తాజాగా వినతి సమర్పించాలని ఎమ్మెల్యేలను ఆదేశించింది. 

అస్పష్టమైన వినతి పత్రంపై అధికారులు చర్య తీసుకోకపోతే.. దానిపై వాళ్లకు తామెలా ఉత్తర్వులు ఇవ్వగలమని సందేహాన్ని లేవనెత్తింది. అక్రమాలు జరిగినప్పుడు అధికారులు చర్యలు తీసుకోకపోతే కోర్టులు జోక్యం చేసుకోవచ్చన్న న్యాయసూత్రంతో ఆమోదిస్తామని స్పష్టం చేసింది. గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు అంటే సరిపోదని, స్పష్టంగా సమగ్రంగా వివరాలు ఉండాలని తేల్చి చెప్పింది. దీనిపై న్యాయవాది జోక్యం చేసుకుంటూ సర్వే నంబరు మినహా అన్నీ వివరాలు సమర్పించామని అన్నారు. వాదనలను విన్న ధర్మాసనం స్పష్టమైన వివరాలతో తాజాగా వినతి పత్రాన్ని అధికారులకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.