
హైదరాబాద్, వెలుగు: ఐదు ఎకరాలలోపున్న రైతులకే రైతుబంధు ఇవ్వాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఎకరాకు రూ.5 వేల సాయాన్ని ఏటా రెండుసార్లు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధును అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, భూమి పరిమితి విధించకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన టి. నందకిషోర్ అనే లాయర్ పిల్ వేశారు. ఐదు ఎకరాల కన్నా ఎక్కువున్న వారికి రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎక్కువ భూమి ఉన్న రైతులు తమ పొలాన్ని కౌలుకు ఇచ్చేస్తున్నారని, అయితే కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. పెట్టుబడి పెట్టలేని వారికి సాయం అందిస్తే మంచిదేనని, కానీ, భూస్వాములకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఏంటని అన్నారు. పిటిషనర్ వాదనలను విన్న చీఫ్ జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలిల డివిజన్ బెంచ్.. సీఎస్తో పాటు రెవెన్యూ, ఫైనాన్స్, వ్యవసాయ శాఖ కమిషనర్లకు నోటీసులిచ్చింది. విచారణను మార్చి 25కి వాయిదా వేసింది.