
- అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్పై తప్పుడు ఆర్టికల్స్ రాశారని ఫైర్
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి పైలట్ల తప్పిదాలు, కాక్ పిట్ గందరగోళమే కారణమంటూ వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ కథనాలు ప్రచురించాయంటూ ఫెడరేషన్ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్ఐపీ) మండిపడింది. తప్పుడు కథనాలు రాసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆ రెండు సంస్థలకూ నోటీసులు పంపించింది.
క్షమాపణలు చెప్పకుంటే చట్టపరంగా ముందుకెళ్తామని ఆ రెండు విదేశీ మీడియా సంస్థలకు నోటీసులు ఇచ్చినట్టు ఎఫ్ఐపీ ప్రెసిడెంట్ కెప్టెన్ సీఎస్ రంధావా వెల్లడించారు. ప్రమాదంపై ఓవైపు విచారణ జరుగుతుండగానే.. పైలట్ తప్పిదమే కారణమంటూ రాయిటర్స్, వాల్స్ట్రీట్ జర్నల్ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుగా ఆపాదించాయని పైలట్ల సంఘం మండిపడింది.
ఆందోళనకు గురిచేసేలా వార్తలు వద్దు
భారీ విమాన ప్రమాదంతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని ఎఫ్ఐపీ నోటీసుల్లో పేర్కొన్నది. దీనిపై ఎయిర్క్రాఫ్ట్యాక్సిడెంట్ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో భారత విమానయాన పరిశ్రమ భద్రత పట్ల ప్రజల్లో ఆందోళన కలిగించేలా కథనాలు ప్రచురించొద్దని కోరింది.
ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా ఇలాంటి కథనాలు ఇవ్వడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నది. మీడియా జర్నలిస్టిక్ సమగ్రతను కాపాడాలని, ప్రజలను తప్పుదారి పట్టించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేసింది.