
గాంధీనగర్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొత్తం 242 మొత్తం మందితో టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం.. గాల్లోకి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. విమానం గాల్లోంచి అమాంతం నేలపై పడటంతో ఆకాశాన్ని తాకేలా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. విమానంలో ఫ్యూయెల్ ట్యాంక్ నిండుగా ఉండటంతో అగ్ని పర్వతం బద్దలైనట్లుగా మంటలు ఎగసిపడ్డాయి.
ఈ ప్రమాదంలో విమానంలోని 229 మంది ప్రయాణికులు, 10 సిబ్బంది, ఇద్దరు పైలెట్లు.. మొత్తం 241 మంది మంటల్లో సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి గురైన ఈ ఎయిర్ ఇండియా విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ నేతృత్వంలో లండన్కు బయలుదేరింది. వీరిద్దరికి విమానం నడపటంలో విశేష అనుభవం ఉంది. ఇద్దరికి కలిపి దాదాపుగా 9,300 గంటల ప్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది.
కెప్టెన్ సభర్వాల్కు 8,200 గంటల విమాన ప్రయాణ అనుభవం ఉండగా.. ఆయన కోపైలట్ క్లైవ్ కుందర్కు 1,100 గంటలు విమాన ప్రయాణ అనుభవం ఉందని తెలిపింది. క్రాష్ కావడానికి ముందు 625 అడుగుల ఎత్తులో ఉన్న విమానం నిమిషంలోనే 475 అడుగులు కిందకు పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి ‘మేడే’ ఎమర్జెన్సీ మేసేజ్ పంపారు. వెంటనే అప్రమత్తమైన ఏటీసీ తిరిగి ఎయిర్ ఇండియా పైలెట్లతో కమ్యూనిట్ కావడానికి ప్రయత్నించగా అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
మేడే ప్రకటించిన నిమిషాల్లోనే విమానం ఎయిర్ పోర్టు సమీపంలో ఆసుపత్రి భవనంపై కుప్ప కూలింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్కు విమానం నడపటంలో చాలా అనుభవం ఉన్నప్పటికీ.. ప్లయిట్ కుప్పకూలిపోవడంపై అనేక అనుమానాలు రేకెత్తున్నాయి. విమానం క్రాష్ కావడానికి పైలెట్ల తప్పిదమా..? లేక సాంకేతిక సమస్య అన్నది తేలాల్సి ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై డీజీసీఏ దర్యాప్తు మొదలుపెట్టింది.