
మేడారం గిరిజన జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం గిరిజన సంక్షేమ బడ్జెట్, మేడారం జాతర నిర్వహణపై ఆమె ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరకు సంబంధించి ఇన్విటేషన్ కార్డులను రెడీ చేయించాలన్నారు. జాతరకు వచ్చే ముఖ్య అతిథిలకు ఇచ్చే మెమెంటోలను ప్లాస్టిక్ రహితంగా… ఇతర ఆర్గానిక్ మెటీరియల్ తో తయారు చేయించాలన్నారు. మేడారం జాతర పై కొన్నివీడియో క్లిప్పులను షూటింగ్ చేయించి ప్రచారం చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అన్నిరకాల ఉద్యోగుల వివరాలు, వచ్చే సంవత్సరంలోగా రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల డేటాను సిద్ధం చేయాలని సూచించారు. అనర్హత గల వ్యక్తులు కూడా గిరిజన సంక్షేమశాఖ పథకాలను పొందుతున్నారని అలాంటి వారిని గుర్తించి శిక్షార్హులుగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి సత్యవతి రాథోడ్.