బిర్యానీ షాపు ఓపేనింగ్ రోజు పెట్టిన ఆఫర్.. ఆ షాపు యజమానిని కటకటాల పాలు చేసింది. తమిళనాడులోని అరుపుకోట్టాయికి చెందిన 29 ఏళ్ల జహీర్ హుస్సేన్ స్థానికంగా బిర్యానీ షాపు పెట్టాలనుకున్నాడు. గత ఆదివారం రోజు షాపు ఓపేనింగ్కి ప్లాన్ చేశాడు. ఓపేనింగ్ రోజు కస్టమర్లను ఆకట్టుకోవాలని.. ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్లేట్ బిర్యాని రూ. 10లకే అని యాడ్ ఇచ్చాడు. దాంతో స్థానిక ప్రజలు ఆదివారం ఉదయం 11 గంటలకు బిర్యానీ షాపు ముందు బారులు తీరారు. కరోనాకు భయపడి ఎవరూ కనీసం మాస్కులు కూడా ధరించలేదు. అంతేకాకుండా.. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఒకరి మీద ఒకరు పడుతూ లైన్ కట్టారు. దాంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ అయింది. షాపు నిర్వాహకులు ఓపేనింగ్ ఆఫర్ కింద 2500 ప్యాకెట్ల బిర్యానీలను విక్రయించడానికి సిద్ధం చేశారు. ఓపేనింగ్కు జనం భారీగా రావడంతో అమ్మకాలు ప్రారంభించారు. దాదాపు 500 ప్యాకెట్లను విక్రయించే సమయానికి అక్కడికి పోలీసులు వచ్చారు. షాపు ముందు గుమికూడిన జనాన్ని పంపించివేశారు. వెంటనే ఆ ప్రాంతంలోని ట్రాఫిక్ను క్లీయర్ చేశారు. షాపు ముందు ప్రజల రద్దీని తగ్గించడానికి ఇద్దరు పోలీసులను దుకాణం ముందు విధులలో ఉంచారు.
అయితే అప్పటికే షాపు నిర్వాహకులు 500 ప్యాకెట్లు అమ్మగా మిగిలిన వాటిని పేదలు, వికలాంగులు, అనాథలకు పంచిపెట్టాలని స్థానిక సీనియర్ పోలీస్ అధికారి నిర్ణయించారు. షాపు ముందు ఉన్న పోలీసులతో ఆ మిగిలిన ప్యాకెట్లను పంచిపెట్టారు. కరోనా మహమ్మారి నిబంధనలను ఉల్లంఘించినందుకు జహీర్ను విరుదునగర్ పోలీసులు అరెస్టు చేశారు. షాపు యజమాని జహీర్ మీద పోలీసులు ఐపీసీలోని వివిధ విభాగాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ఈ సమయంలో ఇటువంటి జిమ్మిక్కులను ప్రవేశపెట్టకూడదని పోలీసులు జహీర్ను హెచ్చరించారు. ఆ తర్వాత అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.
For More News..