న్యూఢిల్లీ: ఫోర్త్ ఫేజ్ లాక్డౌన్ ఇంకో రోజులో ముగియనుండటంతో ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. జూన్ 1 తర్వాత పరిస్థితి ఏంటి అనే దానిపై చర్చించారు. కరోనా కేసులు, లాక్డౌన్ పొడిగింపు, సడలింపులు తదితరాలపై మాట్లాడుకున్నారు. ముఖ్యమంత్రులతో ఫోన్లో జరిపిన చర్చల గురించి, సీఎంలు వ్యక్తం చేసిన అభిప్రాయాల గురించి మోడీకి షా వివరించారు. శుక్రవారం లోక్కల్యాణ్ మార్గ్లోని ప్రధాని ఇంట్లో జరిగిన మీటింగ్లో కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా, ఇతర కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. లాక్డౌన్పై శనివారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆంక్షల విషయంలో రాష్ర్టాలకు స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మొదటి దశలో ఉన్నంత ఫోకస్గా ఇప్పుడు లాక్డౌన్ ఉండకపోవచ్చని అంటున్నాయి. ఐదో దశలో మరిన్ని సడలింపులు ఉంటాయని, ఫోకస్ మొత్తం కంటెయిన్మెంట్ జోన్ల మీదే ఉంచనున్నారని పేర్కొంటున్నాయి.
సీఎంల నుంచి ఫీడ్బ్యాక్
లాక్డౌన్ పొడిగింపుపై సీఎంల అభిప్రాయాలను షా అడిగి తెలుసుకున్నారు. ఈనెల 31 తర్వాత ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ముఖ్యమంత్రులు తమ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఏఏ రంగాలకు మినహాయింపు అవసరం? ఎలాంటి సమస్యలున్నాయి? వంటి అంశాలపైనా చర్చించారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలు మరికొన్ని రోజులపాటు లాక్డౌన్ కొనసాగించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిసింది. ఎకనమిక్ యాక్టివిటీలు కొనసాగిస్తూనే.. రూల్స్ను మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్రానికి సూచించినట్లు సమాచారం.
ఇక లాక్డౌన్ 5.0!
మార్చి 24న దేశమంతటా 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. తర్వాత కొన్ని సడలింపులతో లాక్డౌన్ను మూడు సార్లు పొడిగించారు. ఆదివారంతో నాలుగో దశ ముగియనుంది. ఈ క్రమంలో శనివారం లాక్డౌన్ 5.0పై ప్రధాని మోడీ ప్రకటన చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటికే కొన్ని రాష్ర్టాలు లాక్డౌన్ను మరికొన్ని రోజులు కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు మాత్రం లాక్డౌన్ను ముగించాలని కోరినట్లు సమాచారం.
మరో రెండు వారాలు?
‘‘లాక్డౌన్ను పొడిగించాలని మెజారిటీ ముఖ్యమంత్రులు కోరుతున్నారు. అయితే కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న చోట్ల మరిన్ని సడలింపులు ఇవ్వాలని, ఎకనమిక్ యాక్టివిటీలు ఓపెన్ చేసేందుకు, నార్మల్ లైఫ్ మొదలయ్యేందుకు దారులు తెరవాలని కోరుతున్నారు” అని అధికారులు చెప్పారు. మరో రెండు వారాలు లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు.
13 జిల్లాల్లోనే ఎక్కువ
సీకే మిశ్రా, వీకే పాల్ఆధ్వర్యంలోని రెండు స్పెషల్ కొవిడ్ ప్యానల్స్ తమ రికమండేషన్లను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, రిలీజియస్ సెంటర్లు మినహా మిగతా వాటిపై ఆంక్షలు ఎత్తేయాలని సూచించినట్లు సమాచారం. ఇంటర్ స్టేట్ ట్రావెల్పై నిషేధం కొనసాగించాలని ప్యానల్ సూచించింది. అలాగే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కంటెయిన్మెంట్ మెజర్లు మరింత పెంచాలని రికమండ్ చేసింది. ‘‘దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 70 శాతం 13 జిల్లాల్లోనే ఉన్నాయి. అవి ముంబై, చెన్నై, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, థానే, పుణె, హైదరాబాద్, కోల్కతా, ఇండోర్, జైపూర్, జోధ్పూర్, చెంగల్పట్టు, తిరువల్లుర్. వీటిపై మరింత ఫోకస్ పెట్టాలి” అని సూచించినట్లు సమాచారం.
రాష్ర్టాలు ఇలా..
- హిమాచల్ప్రదేశ్: రాష్ర్టంలోని హమిర్పూర్, సోలన్, సిమ్లా జిల్లాల్లో జూన్ 30 వరకు లాక్డౌన్ ఉంటుందని తెలిపింది.
- గోవా: మరో రెండు వారాలు లాక్డౌన్ పొడిగింపు ప్రకటించే అవకాశం ఉంది. 50 శాతం కెపాసిటీతో రెస్టారెంట్లకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది.
- కర్నాటక: రిలీజియస్ ప్రాంతాలను ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని అడుగుతోంది.
- జమ్మూకాశ్మీర్: 15 రోజులపాటు అమర్నాథ్ యాత్రకు అనుమతి ఇవ్వాలని ప్రపోజల్ పెట్టింది. అలాగే హోటల్స్, హ్యాండీక్రాఫ్ట్లకు పర్మిషన్ ఇవ్వాలంటోంది.
- పంజాబ్: శనివారం తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. స్కూళ్లు, కాలేజీలు, మాళ్లు, హాళ్లు క్లోజ్లోనే ఉంచుతామని చెప్పింది.
- హర్యానా: లాక్డౌన్ కొనసాగింపుకే మద్దతు తెలిపింది. ఢిల్లీతో బోర్డర్ను క్లోజ్లోనే ఉంచాలని అంటోంది.
- ఢిల్లీ: షాపింగ్ మాల్స్, మెట్రో రైళ్లు సహా చాలా వాటిని ఓపెన్ చేయాలని కోరుతోంది.
ఈశాన్య రాష్ర్టాలు: లాక్డౌన్ ఆంక్షల విషయంలో తమకు మరిన్ని హక్కులు ఇవ్వాలని కోరుతున్నాయి. ఎన్డీఎంఏ యాక్ట్ ప్రకారం ఇచ్చే గైడ్లైన్స్ ఫాలో అవుతామని చెబుతున్నాయి.