సింధూ జలాల ఒప్పందంతో నో యూజ్: ప్రధాని మోదీ

సింధూ జలాల ఒప్పందంతో నో యూజ్: ప్రధాని మోదీ
  • ఈ విషయాన్ని నెహ్రూ స్వయంగా అంగీకరించారు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌‌తో సింధూ జలాల ఒప్పందం  భారత్‌‌కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని మాజీ ప్రధాని నెహ్రూ కూడా అంగీకరించారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  కాంగ్రెస్‌‌ పార్టీ రైతులకు వ్యతిరేకమనేందుకు నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన  నేషనల్​ డెమొక్రటిక్ అలయన్స్​(ఎన్డీయే) పార్లమెంటరీ మీటింగ్‌‌లో మోదీ మాట్లాడారు. 

దేశాన్ని జవహర్‌‌‌‌లాల్​ నెహ్రూ రెండు సార్లు విభజించారని చెప్పారు. ‘‘భారత్​ను నెహ్రూ ఒకసారి రాడ్‌‌క్లిఫ్  లైన్‌‌తో విభజించారు. సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి డివైడ్​ చేశారు. దీంతో దేశంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది.  సింధూ నది ఒప్పందం వల్ల 80 శాతం నీరు పాకిస్తాన్‌‌కే వెళ్లిపోయింది. ఈ విషయాన్ని నెహ్రూనే స్వయంగా అంగీకరించారు” అని వ్యాఖ్యానించారు.  

రాజ్యాంగ సవరణతో హక్కులు కాలరాశారు

నెహ్రూ హయాంలో రాజ్యాంగ సవరణ చేసి..వాక్​స్వాతంత్ర్యపు హక్కును కాలరాశారని ప్రధాని మోదీ అన్నారు. 42వ రాజ్యాంగ సవరణ చేసి నియోజకవర్గాల సంఖ్య పెంచారని, ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఇలా చేశారని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్​ ఎప్పుడూ కృషి చేయలేదని చెప్పారు. తమ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. 

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్​ ఎదుగుతున్నదని తెలిపారు. నెహ్రూ పార్లమెంట్​ అప్రూవల్​లేకుండానే ఒంటరిగా వెళ్లి సింధూ నదీ జలాల ఒప్పందం చేసుకొని వచ్చారని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్​ అన్నారు. జవహర్‌‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వం  పాకిస్తాన్‌‌కు రూ. 80 కోట్లు ఇచ్చిందని మరో ఎంపీ రవిశంకర్​ విమర్శించారు.