
- రక్షణ ఉత్పత్తి విలువ రూ. 1.25 లక్షల కోట్లు దాటింది
- యువతే ఈ దేశ అసలైన ఆస్తి..
- మన యువశక్తిని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి
- యువత ఉపాధి కల్పనకు రోజ్గార్ మేళాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి
న్యూఢిల్లీ: డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్లో దేశం సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ ఉత్పత్తి విలువ రూ. 1.25 లక్షల కోట్లు దాటిందని వెల్లడించారు. గత పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. 90 కోట్లకు పైగా ప్రజలు సంక్షేమ పథకాల పరిధిలోకి వచ్చారని అన్నారు. యువతే ఈ దేశపు అసలైన ఆస్తి అని తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన 16వ ఎడిషన్ రోజ్గార్ మేళా వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన 51 వేలకు పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ఎలక్ట్రానిక్ తయారీ 11 ఏండ్లలో ఐదు రెట్లు పెరిగి రూ.11 లక్షల కోట్లకు చేరుకుంది. గతంలో దేశంలో 2 నుంచి 4 మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మొబైల్ ఫోన్ తయారీకి సంబంధించిన 300 యూనిట్లు ఉన్నాయి. ఇవి లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి” అని తెలిపారు. అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడంలో యువ స్నేహితుల భాగస్వామ్యాన్ని పెంచాలని నిశ్చయించు కున్నామని, ఇందులో భాగంగానే రోజ్గార్ మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వికసిత భారత నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయడంలో ప్రభుత్వాన్నికున్న నిబద్ధతను రోజ్గార్ మేళా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
దేశ ఉజ్వల భవిష్యత్తుకు యువతే బలమైన హామీ
దేశ ఉజ్వల భవిష్యత్తుకు యువతే బలమైన హామీ అని ప్రధాన మంత్రి మోదీ తెలిపారు. మన దేశానికి రెండు శక్తులు ఉన్నాయని ప్రపంచం భావిస్తున్నదని, అవి ఇక్కడి జనాభా, ప్రజాస్వామ్యం అని వివరించారు. ‘‘నేను ఇటీవలే 5 దేశాల పర్యటన నుంచి తిరిగి వచ్చాను. ఇతర దేశాలతో మనం చేసుకున్న ఒప్పందాలు కచ్చితంగా మన యువతకు ప్రయోజనం చేకూరుస్తాయి’’ అని తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలను సృష్టించడంపై తన ప్రభుత్వం దృష్టి సారించిందని, ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (ఈఎల్ఐఎస్)ను కేంద్ర కేబినెట్ఆమోదించిందని చెప్పారు. ఈ పథకం కింద ప్రైవేట్ రంగంలో ఉద్యోగం పొందే యువతకు ప్రభుత్వం రూ. 15వేలు అందజేస్తుందని చెప్పారు.
ఈ స్కీమ్కోసం లక్ష కోట్ల బడ్జెట్ను కేటాయించామని, దాదాపు 3.5 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని తెలిపారు. దేశం ఇప్పుడు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నదని చెప్పారు. అలాగే, ప్రపంచంలోనే అతిపెద్ద లోకోమోటివ్ ఉత్పత్తిదారుగా అవతరించిందని, రైలు, మెట్రో కోచ్ల ఎగుమతుల్లో ఎంతో పురోగతి సాధించినట్లు చెప్పారు. ఆటోమొబైల్ రంగం కేవలం ఐదేండ్లలోనే 40 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐని ఆకర్షించిందని, ఫలితంగా కొత్త ఉద్యోగ అవకాశాలు, రికార్డుస్థాయిలో వాహన అమ్మకాలు జరిగాయని వివరించారు.