న్యూఢిల్లీ : గుజరాత్లోని అహ్మదాబాద్లో సబర్మతి నదిపై నిర్మించిన ‘అటల్ బ్రిడ్జి’ ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఆయన ఆదివారం కూడా గుజరాత్లో పర్యటించనున్నారు. మొదటి రోజు పర్యటనలో భాగంగా 300 మీటర్ల పొడవైన అటల్ బ్రిడ్జిని ఆయన లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బ్రిడ్జికి సంబంధించిన ఫొటోలను ట్విటర్లో ఆయన షేర్ చేశారు. ‘‘బ్రిడ్జి అద్భుతంగా కనిపిస్తోంది కదా!. సబర్మతి నదిపై నిర్మించిన అసాధారణమైన ల్యాండ్మార్క్ఈ అటల్ బ్రిడ్జి” అని మోడీ ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరును ఈ బ్రిడ్జికి పెట్టారు.
బ్రిడ్జి విశేషాలు...
అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సబర్మతి నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించింది. ఇది పూర్తిగా ఫుట్ఓవర్ బ్రిడ్జి. అంటే నడిచేందుకు మాత్రమే దీనిని కట్టారు. ఎల్లిస్ బ్రిడ్జి, సర్దార్ బ్రిడ్జిల మధ్య ఈ అటల్ వారధిని నిర్మించారు. దీని పొడవు 300 మీటర్లు, వెడల్పు 14 మీటర్లు. 2,600 మెట్రిక్ టన్నుల స్టీల్ పైపులు వాడి ఈ వారధి కట్టారు. బ్రిడ్జి రూఫ్ను రంగురంగుల ఫ్యాబ్రిక్తో తీర్చిదిద్దారు. రెయిలింగ్ను గ్లాస్, స్టెయిన్ లెస్ స్టీల్తో నిర్మించారు. రివర్ ఫ్రంట్లోని పశ్చిమాన ఉన్న ఫ్లవర్ గార్డెన్ను తూర్పున త్వరలో నిర్మించే ఆర్ట్స్ అండ్ కల్చర్ సెంటర్తో ఈ బ్రిడ్జి కలుపుతుంది. పాదచారులతో పాటు సైక్లిస్టులు కూడా నదిని దాటేందుకు, ట్రాఫిక్ బారి నుంచి తప్పించుకునేందుకు ఈ వారధిని వాడుకోవచ్చు. అలాగే బ్రిడ్జిపై నిలబడి నది మధ్యలో నుంచి నదిని, పరిసర ప్రాంతాలను కూడా చూడవచ్చు. లోయర్, అప్పర్ వాక్వేస్ల నుంచి చేరుకునేలా ఈ బ్రిడ్జిని నిర్మించారు.