
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రాలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓడలరేవులో ఓఎన్జీసీ యూ-ఫీల్డ్ ఆన్షోర్ ఫెసిలిటీలను శనివారం దేశానికి అంకితం చేశారు. విశాఖపట్నంలో రూ. 10,700 కోట్ల విలువైన ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం/శంకుస్థాపనతో పాటు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. యూ-ఫీల్డ్ బంగాళాఖాతంలో కృష్ణ గోదావరి బేసిన్ బ్లాక్ కేజీ- డీడబ్ల్యూఎన్-98/2లో ఉంది.
ఈ ఫీల్డ్ నుండి సహజ వాయువును వినియోగదారులకు పంపించడానికి ముందు సముద్రగర్భ పైప్లైన్ల ద్వారా ఆన్షోర్ ఫెసిలిటీకి తీసుకువస్తారు. అయితే ఈ ఫీల్డ్ నుంచి ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో ఓఎన్జీసీ వెల్లడించలేదు. యూ-ఫీల్డ్ కృష్ణా గోదావరి బేసిన్లో ఓఎన్జీసీ డీప్వాటర్ కేజీడీబ్ల్యూఎన్ 98/2 క్లస్టర్2 ప్రాజెక్ట్లో ఒక భాగం. ఇక్కడి నుంచి రోజుకు మూడు మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ను వెలికితీస్తారు. యూ ఫీల్డ్లోని మొదటి బావి - యూ-3-బీని 11 నెలల రికార్డు సమయంలోనే నిర్మించామని కంపెనీ తెలిపింది.