దేశ సంస్కృతిని కాపాడుకుందాం.. సాధువుల ఆలోచనలు ముందుకు తీసుకెళ్దాం: మోదీ

దేశ సంస్కృతిని కాపాడుకుందాం.. సాధువుల ఆలోచనలు ముందుకు తీసుకెళ్దాం: మోదీ
  • ప్రధాని మోదీకి ‘ధర్మ చక్రవర్తి’ బిరుదుతో సత్కరించిన జైన సాధువులు
  • జైన ఆధ్యాత్మిక గురువు ఆచార్య శ్రీ విద్యానంద్ జీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని

న్యూఢిల్లీ: సాధువులు, సంత్​ల అమర ఆలోచనలు, తత్వాల కారణంగా ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన జీవన నాగరికతను ఇండియా కలిగి ఉన్నదని ప్రధానమంత్రి మోదీ అన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో తన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు. అందరికీ తాగునీరు, ఇండ్లు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సౌలత్​లు కల్పిస్తున్నామని వివరించారు. చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు అందాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌‌‌‌లో జైన ఆధ్యాత్మిక గురువు ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహరాజ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఢిల్లీలోని భగవాన్ మహావీర్ అహింసా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని మాట్లాడారు. ఆచార్య విద్యానంద్ జీ 1987 జూన్ 28న ఆచార్య బిరుదు పొందారని మోదీ గుర్తు చేశారు. ఇది కేవలం ఒక గౌరవం మాత్రమే కాదని.. జైన సంస్కృతిని, ఆలోచనలను, కరుణను అనుసంధానించే ఒక పవిత్రమైన మార్గమని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన సన్యాసి జీవితాన్ని గుర్తు చేసే వేడుక ఇది అని మోదీ అన్నారు. ‘ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహరాజ్ జీవితం, ఆయన సేవలను తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్​ను మోదీ సందర్శించారు.

‘ధర్మ చక్రవర్తి’కి నేను తగిన వాడిని కాను
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ‘ధర్మ చక్రవర్తి’ అనే బిరుదును ఇచ్చారు. ధర్మాన్ని కాపాడే పాలకుడికి గుర్తుగా ఈ బిరుదును మోదీకి అందించారు. ధర్మచక్రవర్తి బిరుదు అందజేయడంపై మోదీ మాట్లాడారు. ‘‘మీరు నాకు ‘ధర్మ చక్రవర్తి’ బిరుదును ప్రదానం చేశారు. నేను ఈ బిరుదుకు తగినవాడిని అని భావించడం లేదు. అయితే, సాధువులు ఏది ఇచ్చినా దాన్ని ప్రసాదంగా స్వీకరించాలనేది మన సంస్కృతి. అందుకే ఈ ప్రసాదాన్ని వినయంగా స్వీకరిస్తున్నాను. ఈ ధర్మ చక్రవర్తి బిరుదును దేశానికి అంకితం చేస్తున్నాను’’అని ప్రధాని మోదీ తెలిపారు.