ప్రధాని నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా పీఎం నరేంద్ర మోడీ. ఈ మూవీని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ పెంచుతున్న యూనిట్ గురువారం ఈ సినిమాలోని ట్రైలర్ ను రిలీజ్ చేసింది. నరేంద్ర మోడీగా వివేక్ ఒబేరాయ్ నటించిన ఈ మూవీ ట్రైలర్లో మోడీ బాల్యంతో పాటు పొలిటికల్ ఎంట్రీ, గోద్రా అల్లర్లు తదితర అంశాలని చూపించారు. ‘ఓ సాధారణ ఛాయ్వాలా.. ఈ దేశ ప్రధాని అవుతాడా’ అన్న డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. మోడీ బాల్యం, RSSలో ఎలా చేరారు.. వంటి సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించారు. మోడీ ప్రధాని అయ్యాక పాకిస్థానీయులు భారత్ పై చేస్తున్న దాడులను చూసి ఓర్వలేక..‘ఇంకోసారి హిందుస్థాన్ పై చెయ్యివేస్తే.. నరికేస్తా. ఇదే పాకిస్థాన్ కు నా హెచ్చరిక’ అని ట్రైలర్ చివర్లో మోడీ చెబుతున్న డైలాగ్ హైలైట్ గా నిలిచింది.
ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి 23 భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో BJP అధ్యక్షుడు అమిత్ షా పాత్రలో సినీ నటుడు మనోజ్ జోషి నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం ఉత్తరాఖండ్ చేశారు. గుజరాత్ సీఎం నుంచి 2014లో లోక్ సభ ఎన్నికల్లో మోడీ సృష్టించిన ప్రభంజనాన్ని కూడా సినిమాలో ప్రజెంట్ చేయనున్నారు. దర్శన్ కుమార్, బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, ప్రశాంత్ నారాయణన్, జరీనా వాహబ్, సేన్ గుప్తాలు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 60 రోజుల్లోనే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు యూనిట్. రాబోయే ఎన్నికల్లో ఈ మూవీ BJPకి కలిసొస్తోందని.. ఇప్పటికే ప్రతిపక్షాలు సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని ప్రకటించాయి. మరి ఏప్రిల్ 5న పీఎం నరేంద్ర మోడీ రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.