
న్యూఢిల్లీ/వాషింగ్టన్: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ) నుంచి రూ.13,500 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తమ్ముడు నెహాల్ మోదీని అమెరికాలో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4న అతడిని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ అధికారులు తమ కస్డడీలోకి తీసుకున్నారు.
నెహాల్ ను అప్పగించాలంటూ అంతకుముందు సీబీఐ, ఈడీ చేసిన ఎక్స్ ట్రాడిషన్ విజ్ఞప్తుల మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఇంటర్ పోల్ కూడా ఇదివరకే అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. నెహాల్ ను అదుపులోకి తీసుకున్న విషయాన్ని భారత అధికారులకు అమెరికా అధికారులు తెలియజేశారు. మనీ లాండరింగ్ కు సంబంధించి నెహాల్ పై రెండు కేసులు నమోదయ్యాయి. మోసపూరితమైన లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్స్ సమర్పించి పీఎన్ బీ నుంచి నీరవ్ మోదీ, నెహాల్ మోదీ, వారి బంధువు మెహుల్ చోక్సీ రూ.13,500 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టి పారిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి.