నీరవ్ మోడీకి నాలుగోసారి బెయిల్ నిరాకరణ

నీరవ్ మోడీకి నాలుగోసారి బెయిల్ నిరాకరణ

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ వేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న…. నీరవ్ మోడీకి మరోసారి బెయిల్ తిరస్కరించింది లండన్ కోర్టు. గతంలో వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు మూడు సార్లు బెయిల్ పిటీషన్ కొట్టివేసింది. నాలుగోసారి హైకోర్టును ఆశ్రయించిన నీరవ్ కు మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో ఆయన ప్రస్తుతానికి జైలుకే పరిమితం కావాల్సి ఉంది. మార్చి 20న అరెస్టు అయిన నీరవ్… ప్రస్తుతం లండన్ హెర్ మెజిస్టీవ్ వాండ్స్ వర్త్ జైలులో ఉన్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.14,000 కోట్లు మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. నీరవ్ మేనమామ, రత్నాల వర్తకుడు మెహుల్ చోక్సీ సైతం ఈ కుంభకోణంలో కీలక నిందితుడే. బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉండగా, మోసపూరితంగా లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూలు) జారీతో వేల కోట్లను కొల్లగొట్టారు.