మన్నెగూడ కిడ్నాప్ కేసు : పోలీసుల ముందు తప్పు ఒప్పుకున్న నవీన్ రెడ్డి

మన్నెగూడ కిడ్నాప్ కేసు : పోలీసుల ముందు తప్పు ఒప్పుకున్న నవీన్ రెడ్డి

మన్నెగూడ కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ నిరాకరించినందునే వైశాలిని వేధించినట్లు నవీన్ రెడ్డి అంగీకరించాడు. వైశాలి స్నేహితురాలి ద్వారా తనకు ఆమె పరిచయమైందని నవీన్ పోలీసులకు చెప్పాడు. వైశాలితో కలిసి బ్యాడ్మింటన్ ఆడేవాడినని, ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రపోజల్ ను వైశాలి ముందు పెట్టానని అన్నాడు. ఆమె తన ప్రేమను నిరాకరించడంతో వైశాలి తండ్రికి విషయం చెప్పినా వారు కూడా అంగీకరించలేదని దీంతో ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో వేధింపులు మొదలుపెట్టానని నవీన్ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. 

ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి ఫొటోలు, వీడియోలు పెట్టడంతో పాటు ఆమె ఇంటి ముందు ల్యాండ్ తీసుకుని షెడ్ వేశానని నవీన్ రెడ్డి చెప్పాడు. వైశాలికి నిశ్చితార్థం జరుగుతుందని తెలుసుకున్న తాను తన వద్ద పని చేసే వారందరిని తీసుకెళ్లి ఆమె కుటుంబసభ్యులపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేసినట్లు అంగీకరించాడు. వైశాలిని కిడ్నాప్ చేసి కారులో ఆమెను చిత్రహింసలు పెట్టినట్లు చెప్పాడు. పోలీసులు తన కోసం వెతుకుతున్న విషయం తెలిసి వైశాలిని క్షేమంగా ఆమె ఇంటి వద్ద వదిలి తాను గోవాకు పారిపోయినట్లు నవీన్ రెడ్డి వెల్లడించాడు. వైశాలిపై అమితమైన ప్రేమ ఉన్నందునే ఆమెను క్షేమంగా ఇంటికి పంపించినట్లు పోలీసులకు చెప్పాడు.

మన్నెగూడ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డి కస్టడీ కోరుతూ ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏ1 నవీన్ రెడ్డితో పాటు ఏ6 చంద్రశేఖర్ అలియాస్ చందును ప్రశ్నించాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం ఇవాళ విచారణ జరపనుంది. కిడ్నాప్ కేసుకు సంబంధించి కోర్టు నవీన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటు మరో ఐదుగురిని ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరిచగా న్యాయస్థానం వారందరినీ రిమాండ్కు పంపింది. ఈ సందర్భంగా తాను మాట్లాడిన 58 నిమిషాల వీడియోలో కేవలం 2 నిమిషాల వీడియోను మాత్రమే మెజిస్ట్రేట్ ముందుంచి తాను తప్పు ఒప్పుకున్నట్లు చిత్రీకరించారని నవీన్ రెడ్డి వాపోయారు.