భార్య ఫ్రెండ్ ఫోటోలు నెట్లో పెట్టిన భర్త అరెస్ట్

భార్య ఫ్రెండ్ ఫోటోలు నెట్లో పెట్టిన భర్త అరెస్ట్

నేరెడ్మెట్, వెలుగు: భార్య తన మాట వినడం లేదనే కోపంతో ఓ భర్త ఆమె ఫ్రెండ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి అసభ్యకర పోస్టు చేశాడు. నిందితుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నేరెడ్ మెట్ లోని రాచకొండ సీపీ ఆఫీసులో మహేశ్​భగవత్ వివరాలు వెల్లడించారు. జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని దమ్మాయిగూడ లక్ష్మినగర లో జాన్ జార్జి అలియాస్ సన్నీ(30) దంపతులు ఉంటున్నారు. రాధిక థియేటర్ లో సన్నీ ప్రొజెక్టర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతడి భార్య ప్రైవేటు జాబ్ చేస్తోంది. ఇటీవల సన్నీ భార్య ఆఫీసు నుంచి లేటుగా ఇంటికి వస్తోందని ఆమెతో గొడవపడ్డాడు. ఆఫీసులో టీం లీడర్ తో మీటింగ్ ఉంటోందని అందుకే ఆలస్యమవుతోందని భార్య చెప్పినా సన్నీ ఆమె మాటలు పట్టించుకోలేదు. భార్య చెప్పిన మాట వినడం లేదని సన్నీ ఆమెపై కోపంపెంచుకున్నాడు. భార్యపై కోపంతో సన్నీ సెప్టెంబర్ 23న ఆమె స్నేహితురాలు, ఆఫీసులో టీం లీడర్ అయిన మహిళ ఫోటోలతో షేర్ చాట్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. కాల్ గర్ల్ అంటూ ఆమె ఫోన్ నంబర్ పోస్ట్ చేశాడు. తరచుగా ఆ మహిళకు ఫోన్ కాల్స్ రావడంతో ఆందోళన చెందిన ఆమె గురువారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు షేర్ చాట్ ఐడీ ద్వారా నిందితుడు సన్నీని గుర్తించి శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని రిమాండ్ కి తరలించినట్టు సీపీ మహేష్​ భగవత్ తెలిపారు.