షాద్ నగర్ బాధితురాలు దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. 10 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని షాద్ నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షాద్ నగర్లో అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ఈ కేసులో నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని అందులో తెలిపారు పోలీసులు. సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉందని, జ్యూడిషియల్ రీమాండ్కు తరలించే రోజు వేలాది ప్రజలు పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టడంతో నిందితుల వద్ద పూర్తి వివరాలు తీసుకోవడం కుదరలేదని చెప్పారు.
బాధితురాలి ఫోన్ ఎక్కడ?
నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు బాధితురాలి ఫోన్ కీలకంగా ఉపయోగపడింది. కాల్ లిస్టు ఆధారంగా ఆమె ఫోన్ నుంచి ఏ1 మహ్మద్కు ఫోన్ చేసినట్లు గుర్తించిన పోలీసులకు ఆ కిరాతకులను అరెస్టు చేయడం సులువైంది. అయితే ఆ ఫోన్ ఇంకా దొరకలేదు. అది ఎక్కడుందన్నది తెలిస్తే మరికొంత సమాచారం తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అలాగే నిందితుల నుంచి మరింత సమాచారం తీసుకోవాల్సి ఉండడంతో వారిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరుతున్నారు. వారి పిటిషన్ను కోర్టు విచారించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కోర్టు దగ్గర నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు.