రాజేంద్రనగర్లో 16 లక్షల విలువైన గంజాయి పట్టివేత

రాజేంద్రనగర్లో 16 లక్షల విలువైన గంజాయి పట్టివేత

రంగారెడ్డి: శంకర్పల్లి ఎక్స్ రోడ్డువద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఓ లారీలో ఒడిశా నుంచి మహారాష్ట్ర మీదుగా తెలంగాణకు తరలిస్తుండగా.. పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు, చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి గంజాయిని పట్టుకున్నారు. ఫిబ్రవరి 11న సాయంత్ర పక్కా సమాచరంతో లారీలో తరలిస్తున్న 64 కేజీల ఎండు గంజాయి తోపాటు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

మహారాష్ట్రకు చెందిన చిత్ర కైలాష్ మోహిత్ (35), నవనాథ్ గనఫత్ చవ్వాన్ (70), మదన్ బాలా సాహెబ్ బయన (38), రాజేష్ సుభాష్ మోహిత్(15), లాము పలారీ, రేఖ, మనోజ్ షింగ్విలు సంగారెడ్డి మీదుగా మహారాష్ట్ర వెళ్లేందుకు లారీ కోసం చేవెళ్లలోని శంకర్ పల్లి ఎక్స్ రోడ్డు వద్ద వేచి ఉన్నారు. అదే సమయంలో పక్కా సమాచారంతో చేవెళ్ల పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్ వోటీ సిబ్బంది సంయుక్తంగా వారిని పట్టుకొని వారి వద్ద 64 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.16.10 లక్షలు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.