హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్, చార్మినార్ వద్ద పోలీసులు భారీగా మొహరించారు. హైదరాబాద్ లో వరద సాయం ఆపాలంటూ ఎస్ఈసీకి లేఖ రాశారంటూ తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు బండి సంజయ్. దీనిపై చార్మినార్ లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయడానికి రావాలంటూ సీఎం కేసీఆర్ కు సవాల్ చేశారు. లేఖపై నిజాలు తేల్చుకుందామన్నారు. ఇందుకోసం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మీ గుడికి వెళ్తానన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి చార్మినార్ వరకు బైక్ ర్యాలీకి ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 12 గంటలకు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వస్తానని చెప్తున్నారు సంజయ్. ఐతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున బీజేపీ ర్యాలీకి చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ కు వెళ్లేందుకు బండి సంజయ్ కు 11 గంటల నుంచి 12 వరకు అనుమతిచ్చారు.
దీంతో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ఆఫీస్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. అయితే బండి సంజయ్ పార్టీ ఆఫీసులో లేరు. బండి సంజయ్ ఎక్కడున్నాడో పోలీసులకు కూడా సమాచారం లేదు. భాగ్యలక్ష్మి టెంపుల్ కు ఎక్కడి నుంచి వెళ్తారో అర్థంకాని పరిస్థితి.ఈ నేపథ్యంలోనే ఎలాగైనా బండి సంజయ్ చార్మినార్ వెళ్లకుండా ఆపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖపై సైబర్ క్రైమ్ లో ఇప్ప టికే ఫిర్యాదు చేశామన్నారు బీజేపీ నేతలు.