
- ప్రభుత్వ సంకేతాలతో మొదలైన రాజకీయ చర్చలు
- ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు
మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రకటనతో ఒక్కసారిగా గ్రామాల్లో రాజకీయ చర్చలు మొదలయ్యాయి. రిజర్వేషన్ల విషయంలో స్పష్టత లేక పోవడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులపై ఆశ పెట్టుకున్న నాయకులు రిజర్వేషన్లు అనుకూలంగా వస్తాయో లేదో అని సంశయిస్తున్నారు.
ఎప్పటి నుంచో ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్న వారు ఓ వైపు పార్టీ తరపున అభ్యర్థిత్వం ఖరారు కోసం ప్రయత్నాలు చేసుకుంటూనే మరోవైపు గ్రామాల్లో వివిధ వర్గాల ప్రజల మద్దతు కూడగట్టు కొనే పనిలో పడ్డారు. ఆరు నెలల కింద స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు నిర్వహించింది. పలు కొత్త మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటైన నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల గుర్తింపు, ఓటర్ జాబితాల సవరణ, ప్రకటన, పోలింగ్ స్టేషన్ ల గుర్తింపు, బ్యాలెట్ బాక్స్ లను సమకూర్చడం, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వంటి పనులన్నీ జరిగాయి. ఇక ఎన్నికల షెడ్యూల్ రావడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో బీసీ రిజర్వేషన్ల కోసం ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది.
ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఇటీవల ప్రభుత్వం నుంచి వస్తున్న సంకేతాలతో గ్రామాల్లో ఒక్క సారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆశావహులు స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఇదిలా ఉంటే రిజర్వేషన్ల ప్రక్రియ, నోటిఫికేషన్ విడుదల కాకముందే కొందరు ఆశావాహులు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకు అటెండ్ అవుతూ దగ్గరుండి పనులు చక్కబెడుతున్నారు. గ్రామాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు విధిగా హాజరై తోచిన ఆర్థిక సాయం చేస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు స్పోర్ట్స్ కిట్స్ సరఫరా చేస్తూ పోటీలు కండక్ట్ చేస్తున్నారు. మద్దతు కోరుతూ ముఖ్య నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
స్థానాలు ఇలా..
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 73 జడ్పీటీసీ స్థానాలు, 1,680 ఎంపీటీసీ స్థానాలు, 1,626 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. 18 లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉండగా 21 జడ్పీటీసీ స్థానాలు, 189 ఎంపీటీసీ స్థానాలు, 492 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. మొత్తం 5,24,451 మంది ఓటర్లు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 508 గ్రామ పంచాయతీలు, 230 ఎంపీటీసీ, 26 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. పంచాయతీల పరిధిలో 6.14 లక్షల మంది ఓటర్లుండగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం 11,737 మంది సిబ్బందికి 10 మంది మాస్టర్ ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో 26 మండలాల పరిధిలో మొత్తం 647 గ్రామ పంచాయతీలు, 26 జడ్పీటీసీలు, 667 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలోని 8 మండలాలకు చెందిన 11 గ్రామాలను పంచాయతీలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా మరో 11 గ్రామాలను మున్సిపాలిటీలో కలుపుతూ అప్ గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీల సంఖ్య యధావిధిగా ఉండగా వార్డుల సంఖ్యలో స్వల్పంగా మార్పులు జరిగాయి. జిల్లాలో మొత్తం 8,36,370 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 4,16,181 మహిళా ఓటర్లు 4,20,143, ఇతరులు 46 మంది ఉన్నారు. మొత్తం 5,732 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.