
- బద్వేలులో 59.58శాతం పోలింగ్ నమోదు
కడప: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలోని 281 పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు నడుమ పోలింగ్ నిర్వహించారు. కడపటి వార్తలు అందే సమయానికి బద్వేలు నియోజకవర్గంలో 59.58 శాతం పోలింగ్ నమోదు అయింది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన కూడా పోటీ నుండి తప్పుకోవడంతో ఎన్నికల ప్రచార సరళి ఏకపక్షంగా సాగినట్లు తెలుస్తోంది. అయితే ఉనికిని చాటుకోవడం కోసం పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా రంగంలోకి దిగడంతో ఎన్నికకు దారితీసింది. ముఠా కక్షల ఖిల్లాగా పేరుపొందిన ప్రాంతం కావడంతో ఎన్నికల కమిషన్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఎన్నికల అధికారి విజయానంద్ వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఉప ఎన్నికను పర్యవేక్షించగా.. కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు.
బీజేపీ ఏజెంట్లుగా తెలుగుదేశం కార్యకర్తలు
బద్వేల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో పోటీ చేయమంటూనే బీజేపీకి బహిరంగ మద్దతు ఇచ్చింది. అంతేకాదు బద్వేల్ నియోజకవర్గంలో చాలాచోట్ల టీడీపీ నాయకులు బీజేపీ ఏజెంట్లుగా మారారు. బీజేపీకి దగ్గరవడానికి బద్వేల్ ఎన్నికలను టీడీపీ వాడుకున్నట్లు స్పష్టమైంది. కాగా తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీకి మద్దతివ్వడంపై ఆ పార్టీ దళిత నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది.