
మహారాష్ట్ర మొత్తం సీట్లు 288
మొత్తం అభ్యర్థులు 3,237
స్వతంత్ర అభ్యర్థులు 1,400
పార్టీలు పోటీ చేస్తున్న సీట్లు
బీజేపీ 164
శివసేన 124
కాంగ్రెస్ 147
ఎన్సీపీ 121
ముంబై:మహారాష్ట్ర పోలింగ్కు సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయత్రం 6 గంటల దాకా పోలింగ్ జరగనుంది. 288 స్థానాలకు 3,237 మంది బరిలో ఉన్నారు. 235 మంది మహి ళా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 1400 మంది స్వతంత్ర అభ్యర్థులూ పోటీలో నిలబడ్డారు. వరుసగా రెండోసారీ గద్దెనెక్కేందుకు అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. మరో అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లను కోరుతోంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం అశోక్ చవాన్, నాందేడ్ జిల్లాలోని భోకర్ నుంచి, పృథ్వీరాజ్ చవాన్ సతారా జిల్లాలోని కరద్ సౌత్ నుంచి బరిలో దిగారు. ఇటు మహారాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే వర్లి నుంచి పోటీ చేస్తున్నారు.
బీజేపీ, శివసేన మధ్య జరిగిన ఒప్పందానికి తగ్గట్టు ఆ రెండు పార్టీలు ఆయా స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. బీజేపీ 164 సీట్లలో, శివసేన 124 సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య కూడా పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ 147, ఎన్సీపీ 121 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాయి. సతారా లోక్సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. దివ్యాంగులకు అలోక జిల్లాలోని ఆటోలు ఫ్రీ సర్వీస్ ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పటికే జిల్లా ఆటో రిక్షా యూనియన్కు చెందిన వంద మంది డ్రైవర్లు, తమ ఆటోలపై ‘దివ్యాంగుల కోసం ఒక్కరోజు’ అన్న పోస్టర్లు పెట్టారు. ఓటేయడానికి వెళ్లే దివ్యాంగులు, ఫోన్ చేస్తే చాలు ఫ్రీగా తీసుకెళ్లి పోలింగ్ బూత్ దగ్గర దింపుతారు.
హర్యానాలో డిసైడ్ చేసేది యూతే
మొత్తం ఓటర్లలో దాదాపు సగంమంది 40 ఏండ్లలోపు వాళ్లే
చండీగఢ్: 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి యంగ్ ఓటర్లే ఫలితాన్ని డిసైడ్ చేయనున్నారు. సోమవారం పోలింగ్ జరుగుతోన్న ఈ రాష్ట్రంలో మొత్తం కోటి 83 లక్షల మంది ఓటేసేందుకు అర్హులుకాగా, వాళ్లలో 40 ఏండ్లలోపు వయసున్న ఓటర్ల సంఖ్య 89 లక్షలుగా ఉంది. మొత్తం ఓటర్లలో యంగ్ ఓటర్లే దాదాపు సగానికి ఉండటంతో వీళ్లపైనే అన్ని పార్టీలూ ఫోకస్ పెట్టాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ సమస్యను హైలైట్ చేస్తూ ప్రచారం సాగించగా, రెండో సారి అధికారంలోకి వస్తే 50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా రూల్స్ మార్చుతామని బీజేపీ హామీ ఇచ్చింది. హర్యానా ఎన్నికలలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉన్నప్పటికీ, ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ), జన్నాయక్ జనతాపార్టీ (జేజేపీ) తమదైన శైలిలి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి.
దీంతో కొన్నిచోట్ల ట్రయాంగిల్ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ మొత్తం 90 స్థానాల్లో పోటీచేస్తుండగా, ఐఎన్ఎల్డీ 81 సీట్లలో, బీఎస్పీ 87 సీట్లలో బరిలోకి దిగింది. అన్నిచోట్లా కలిపి 375 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డ మొత్తం అభ్యర్థుల్లో 42 శాతం మంది కోటీశ్వరులే కావడం గమనార్హం. వీళ్లలో 10 శాతంమంది వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి నేరచరిత్ర ఉన్న అభ్యర్థులు సంఖ్య మూడు శాతం పెరిగిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తెలిపింది.
288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర, 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలతో పాటు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ సీట్లకు, సమస్తిపూర్(బీహార్) లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలకు నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంట లకే పోలింగ్ ముగుస్తుంది. అసెంబ్లీ బైఎలక్షన్ జరు గుతోన్న రాష్ట్రాల్లో యూపీలో 11 సీట్లు, గుజరాత్(6), బీహార్(5), కేరళ(5), అస్సాం(4), పంజాబ్(4), సిక్కిం(3), హిమాచల్, తమిళనాడు, రాజస్తాన్లో రెండేసి స్థానాలు, తెలంగాణ, పాండిచే రి, ఒడిశా, మేఘాలయ, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్లో ఒక్కో అసెంబ్లీ స్థానం ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు పూర్తయిన ఆరు నెలల్లోపే ఈ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో అక్టోబర్ 24న వెలువడే ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
హర్యానామొత్తం సీట్లు 90
మొత్తం అభ్యర్థులు 1,169
ఇండిపెండెంట్లు 375
పార్టీలు పోటీ చేస్తున్న సీట్లు
బీజేపీ 90
కాంగ్రెస్ 90
ఐఎన్ఎల్డీ 81
బీఎస్పీ 87